Apple PodcastsSpotifyGoogle Podcasts

‘చిట్టి తల్లి’ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘చిట్టి తల్లి’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . 

పుస్తకం కొనడానికి కావాల్సిన  web link

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. కథను రెండు భాగాలుగా ఆడియో చెయ్యడం జరిగింది, నిడివి ఎక్కువ కావడం వల్ల .

ఎపిసోడ్లో ముందుగా వారి తండ్రి గారి గురించీ , కథ గురించీ పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.

చిట్టి తల్లి:

దక్షిణామూర్తి గాలి పీల్చుకోడానికి నిడదవోలు ప్లాట్ఫారం మీదికి దిగాడు.  కుపే ఒక రకంగా సుఖంగానే ఉంటుందిగాని, మిగతా పెట్టెలాగ రైలు కదులుతున్నా గాలి రాదు. అయితే – కుపేలోకి బొగ్గు నెరుసులు, అనవసరమైన ప్రయాణీకులు అట్టే  రారు. లాభనష్టాలు ప్రతిదానికీ ఉంటాయనుకుని తృప్తి పడ్డాడు దక్షిణామూర్తి…

ప్లాట్ఫారం మహా రద్దీగా ఉంది. ఈ పెట్టెలో కాళీ లేదంటే, ప్రయాణీకులు మరో పెట్టి దగ్గరకు పరుగెత్తుతున్నారు. వాళ్ళ ఆత్రంలో జంతు సహజమైనదేదో ఉంది. అసలు దక్షిణామూర్తి ఎన్నికలో సామాన్య ప్రజలు జంతువులే, అయితే అప్పడప్పుడు ఆ జంతువులతో రాసుకు తిరగడం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటప్పుడు, బొత్తిగా ఒంటరిగా కొన్ని గంటల సేపు కుపేలో ప్రయాణం చేశాక, జీవ చైతన్యం ఉన్న వస్తువులతో తాత్కాలిక సంపర్కం కాస్త అవసరం. అయితే ఆ సంపర్కం అతనికి విసుగు పుట్టిస్తే, మళ్ళీ తన ఏకాంతంలోకి తను పోవడానికి అవకాశముండాలి. ఆ కుపేలోకి పోతే, ఈ జనం తన్ను తాకలేదన్న ధీమాతోనే, దక్షిణామూర్తి జనసముద్రంలోకి అడుగుపెట్టాడు. సోడాలూ, తినుబండారాలూ, పుస్తకాలూ అమ్మేవాళ్ళు పెట్టెలను తోసుకుంటూ, అతన్ని రాసుకుంటూ పోతున్నారు. పక్కపెట్టెలో మనిషి అరిటిపండు తినేసి విసిరిన తొక్క అతన్ని తలవెంట్రుక వాసిలో దూసుకుపోయింది. జనప్రవాహాన్నించి కొంచెం దూరం తొలిగి నిలబడ్డాడు దక్షిణామూర్తి. ప్లాట్ ఫారం మీదికి దిగడంలోనూ లాభనష్టాలున్నాయి.

“ఏండోయి దక్షిణామూర్తిగారూ? హ! హ!హ!” అంటూ ఒక విగ్రహం అతని రెండుచేతులూ పట్టుకుని ఊపింది.

“ఏమిటి విశేషాలు? పట్నమేనా? ఏవండీ! అక్కడెక్కడో అచ్చు ఇటికల ఫాక్టరీ పెడుతున్నారంట, కాస్త వివరాలు మాక్కూడా ఇవ్వండి.

దానమ్మా మోసిరి ఉన్న లాభాలన్నీ మీరే ఏసుకోవాలేంటండీ? అవునుగాని, కలప మా దగ్గిర కొనడం బొత్తిగా మానేశారేంటి?”

దక్షిణామూర్తికి వ్యాపారమంటే పిచ్చి మోజు. లాభ నష్టాల మాట అటుంచి, అసలు వ్యాపారంలో ఏదో ఒక విధంగా తనది పైచెయ్యి అనిపించుకోవాలి. అయితే ఒక్కొక్కప్పుడు – ముఖ్యంగా ఇలాగ విశ్రాంతి కోసం ప్రయాణాలు చేస్తున్నప్పుడు – వ్యాపార వాతావరణం నించి దూరంగా ఉండాలనిపిస్తుంది. కాని పెద్ద వ్యాపారస్థుడుగా పేరు ప్రఖ్యాతులు గడించాక, ప్రతి ఊళ్ళోనూ పదిమందితో వ్యాపార రీత్యా పరిచయం ఏర్పడ్డాక, అలా దూరంగా తొలిగిపోయి ఉండడం అసాధ్యమని అతనికి అనుభవంవల్ల తెలుసు. అదీగాక తనకు లోపల ఎంత చిరాకుగా ఉన్నా వాళ్ళతో ఆప్యాయంగా, చిరునవ్వు చెదరకుండా మాట్టాడ్డం వ్యాపారానికి ముఖ్యావసరం – 

ఒక్కరికి మనస్సు నొచ్చుకునీ మాట అతడు మాట్లాడాడా, అతను ఇన్నాళ్ళూ నిర్మించుకుంటూ వచ్చిన పలుకుబడి, ఔన్నత్యం పేకమేడలాగ కూలిపోతుందని అతనికి తెలుసు. 

పలకరించడం కోసమే దగ్గరగా వచ్చారు. మరికొందరు అతని సహాయం అర్థించడానికొచ్చారు. 

. అతడు అందరిని సమంగా మాటలతో గౌరవించి, రైలు కదలబోతుండగా తన కుపే ఎక్కేశాడు. ఎక్కుతూ రైలులో ప్రయాణం చేస్తున్న ఉద్యోగిని సంజ్ఞచేశాడు

“చూడప్పలసామీ, ఆ పెద్దమనుషులంతా ఈ కుపేలో పై బర్తుకోసం నిన్ను వేధించుకు కతింటారు. నా స్నేహితులెవరో బెజవాడలో ఎక్కుతారు, అంచేత రెండూ నేనే రిజర్వు చేయించానని చెప్పు.”

“నాకు మీరు చెప్పక్కర్లేదు సార్. అప్పుడే కొందరు నన్నడగడం, నేను కాళీ లేదని చెప్పడం అయింది.”

ఉద్యోగి కదులుతున్న రైలు కమ్మీ పట్టుకుని పక్క కంపార్టుమెంటులోకి వెళ్ళిపోయాడు. దక్షిణామూర్తి తన కుపే తలుపులు గట్టిగా మూసుకున్నాడు. ఇంక పట్నం వెళ్ళేవరకూ వాటిని తెరవకూడదనుకున్నాడు. పాపం రైల్వే ఉద్యోగులు అతనెంత చెపితే అంత. అతను కావాలంటే రైలంతా కాళీ చేయించి అతనికిస్తారు.

కొంచెం బొగ్గురజను పడిందేమోనన్న అనుమానం కొద్దీ పక్క బాగా దులిపి మళ్లీ వేశాడు. దక్షిణామూర్తి. తలగడకింద లోపలికున్న పిస్తోలు తీసి చేతితో ఒక్కసారి దాని బరువు చూసి, పక్కని పెట్టుకున్నాడు. ఆ పిస్తోలు దగ్గరుంటే తనకింక ఏ అపాయం రాదని అతని నమ్మకం. 

అప్పుడే కనుచీకటి పడుతోంది. బర్తుమీద మూలగా ఉన్న దీపం వెలిగించాడు. పైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ విప్పి చదవడం మొదలు పెట్టాడు.

బ్రతుకొక బజారు. అందులో ప్రతివ్యక్తి విలువను పెంచుకోడానికి ప్రయత్నిస్తాడు. నిత్యం పైకో కిందకో పోతుంటాడు. ధర పెరిగినప్పుడు ధనంగా మార్చుకో గలవాడు సమర్థుడు. ఇంకా పెరుగుతుందన్న ఆశకొద్దీ బిగుసుక్కూచున్నవాడు ఆఖరికి పడిపోక తప్పదు. ధర తగ్గుతున్నప్పుడు ఆదుర్దాగా అమ్మడానికి ప్రయత్నిస్తే, ధర మరీ పడిపోతుంది. ప్రతిదినం ఈ పత్రికలో ఇదే కథ తను చదువుతున్నాడు. ఈవేళ కూడా ఎందుకీ తాపత్రయం ! ఈవేళ హాయిగా అన్నీ మరిచిపోవాలి! రేపెలాగా తప్పదు.

మూసిన గాజు కిటికీ అవతల అస్పష్టంగా కదిలిపోతోంది. ప్రకృతి – చెట్లు, చేమలు, ఇల్లు, దీపాలు, దగ్గర స్తంభాలు, దూరపు కొండలు. కాని ద్విజ మండల రేఖ  మాత్రం అతనితో సాగుతూ వస్తుంది. మధ్య మాయమైనా, మళ్ళీ వస్తోంది. పరధ్యానంగా చూస్తున్నాడు దాని వేపే. ఆ రేఖమీద – అవతరించింది అనసూయ ముఖం. అందంగా, తీక్షణంగా,  ఆడతనం, అహంకారం అన్నీ కలుసుకున్నాయి ఆ ముఖంలో.  అనసూయా షుగర్ మిల్స్  తనతో అరణంగా తెస్తుంది. ముప్పయి లక్షలు విలువగల ఫ్యాక్టరీకి ఆమె ఏకైక వారసురాలు. ఇంకా పెళ్ళికాకముందే అతని ఇంటికి యజమానురాలులా ప్రవర్తిస్తోంది. ఇంటికే కాదు అతనికిన్ని – తాంబూలాలు పుచ్చుకుని రెండేళ్ళయింది. ఎప్పటికైనా పెళ్ళిచేసుకోక తప్పదు. అయితే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న స్వేచ్చను వీలయినంతకాలం పొడిగిస్తున్నాడు దక్షిణామూర్తి.

అనసూయ అందమైనదీ, హోదాగలదీ. అతనికి చాలా ఇష్టం. పక్కని కూచుంది ఆమె చెయ్యి పట్టుకుని నలపకండా ఉండలేడు.  పళ్లుబిగించి, తీవ్రంగా, ఏకాంతంగా, ఆమెతో ఏకమైపోతున్న దృశ్యాలు ఊహించుకోకుండా ఉండలేడు. ఆమె విలువ ముప్ఫయి  లక్షలు – ఈ రోజుని. అయినా అతను పెళ్ళి వాయిదా వేస్తున్నాడు.

అప్పుడప్పుడు తన బ్రహ్మచారి స్నేహితులు అతన్ని పార్టీలకి పిలుస్తుంటారు. అప్పుడప్పుడు పార్టీలు అతని ఇంట్లోనే జరుగుతుంటాయి. ఎప్పుడో రాత్రి తొమ్మిది గంటలకి  ప్రారంభమౌతాయి. అప్పుడప్పుడు తెల్లవారిపోయేదాకా సాగుతుంటాయి. మర్నాడెంత నీరసపెట్టినా, వాటి సరదా వాటిదే. 

తన టైపిస్టు సులోచన – ఎప్పుడన్నా – ఇంకెవరూ దొరక్కపోతే వస్తుంటుంది. అనసూయకన్నా సులోచన ఎక్కువని కాదు. సులోచనలు వందలకొద్దీ ఉన్నారు. అనసూయ ఒక్కత్తే ఉంది. అయితే అప్పుడప్పుడు ఏ సులోచనతోనన్నా ఒక్క రాత్రి సరదాగా గడపడానికీ, అన్నీ మరిచిపోడానికి అవకాశం ఇస్తుంది బ్రహ్మచర్యం. గృహస్థు అయిన మరుక్షణంనించీ ఈ అవకాశం పోతుంది. 

ఈ రెండు ఆశ్రమాలకీ, వాటికి తగిన విలువలు నిర్ణయించి, తన వయస్సుకి ఒక ధర ఇచ్చుకుని, పెళ్ళయ్యాక వచ్చీ లాభాలు బేరీజు వేసుకుని, పోయే స్వాతంత్ర్యానికి నష్టపరిహారం కట్టుకుని, లాభనష్టాల పట్టీ ఒకటి మనస్సులో తయారు చేసుకుంటున్నాడు దక్షిణామూర్తి.

అప్పుడతని కంటబడింది – కదులుతున్న చిడత. ఆ చిడత పాకీ దొడ్డి తలుపుది. ఒక్కసారి పైకి లేచి మళ్లీ కిందపడిపోయింది, చిరు చప్పుడు చేస్తూ..

దక్షిణామూర్తికి ముచ్చెమటలు పోశాయి. పాకీదొడ్డిలో ఎవడో దొంగ ఉన్నాడు. ఈ కుపేల్లో రెండూ మూడూ కూనీలూ, దొంగతనాలూ జరిగినట్టు పత్రికల్లో చదివాడు. 

ఈ దొంగలకి దయాదాక్షిణ్యాలుండవు. లేవబోయాడు. లేచి గొలుసు లాగాలని అతని అభిప్రాయం. కూర్చుని కాళ్లు క్రింద పెట్టాడు. టప్పుని చిడత చప్పుడు చేస్తూ రెండో పక్కకి తిరిగి పోయింది. తను లేచి గొలుసు లాగే లోగా దొంగ తనమీదపడి ఏమన్నా చెయ్యగలడు.

 అతని కాళ్ళు జావలా మెత్తబడిపోయాయి. తన దగ్గర దొంగతనంగాని, కూనీగాని చెయ్యవలసినంత డబ్బులేదని చెపితే ఆ దొంగ నమ్ముతాడా? చటుక్కుని పిస్టలు గుర్తుకొచ్చింది. గభాల్న దాన్ని తీసి పాకి దొడ్డి తలుపువేపు గురిపెట్టి అరిచాడు.

“రా! ఇవతలికి రా?”

తనగొంతు ఎవరి గొంతులాగో ధ్వనించింది, అవసరమైనంత గట్టిగా, తలుపు మెల్లగా తెరచుకుంటోంది. ఆ చిడతకి ఒక అడుగు పై దృష్టికి కేంద్రీకరించి పిస్టలు  గురిపెటాడు. దొంగ గుండెకాయ ఆ ప్రాంతంలో ఉంటుందని అతని అంచనా. తలుపుకీ, గుమ్మానికీ మధ్య చీలిక పెద్దదయింది. తలుపు వెనకాల, అతను చూస్తున్న చోట అంతా కాళీ. దొంగ తలుపు చాటుని దాక్కుని తీస్తున్నట్టున్నాడు.

 “దాక్కుని  లాభంలేదు. నా చేతిలో పిస్టలుంది” అని ధీమాగా అన్నా డీసారి

ఎందుకో ఇంక దొంగ తనకి లొంగిపోయినట్టనిపించింది.

తలుపు  తెరుచుకుంది. అతని చూపులు కేంద్రీకరించని క్రిందభాగంలో ఏదో కదిలింది. 

కిందికి  చూశాడు. చేతులో పిస్టలు అనుకోకుండా జారిపోయింది. నరాలన్నీ సర్దుకుని  పట్టు వదిలేశాయి. అతనికి చటుక్కున పక్కలు పగిలేటంత నవొచ్చింది. 

ఏనుగంత దొంగ ఇవతలి కొస్తాడని అతను అన్నిటికీ సిద్ధపడి ఎదురు చూస్తుంటే అందులోంచి ఇవతలి కొచ్చింది – ఒక ఎలక పిల్లలాంటి చిన్న ఆడపిల్ల.

నాలుగైదేళ్ళుంటాయి. చింకి పరికిణీ, చింపిరి జుట్టూ, కళ్లు అమాయకంగా చురుగ్గా మెరుస్తున్నాయి. దక్షిణామూర్తికి ఆ పిల్లమీద కోపం మట్టుకు రాలేదు. తన ఆందోళననీ, దయాన్నీ పోగొట్టినందుకు, నిజంగా దొంగ కాకుండా నిరపాయకరమైన చిన్నపిల్లగా మారిపోయినందుకు ఒక రకమైన కృతజ్ఞత కూడా అతనికి కలగక పోలేదు. అందుచేత సౌమ్యంగా అడిగాడు.

“పాకీ దొడ్లో ఎందుకు దూరావు?”:

 “నువ్వు పెట్లో కెక్కుతుంటే, నేను దొడ్లోకెల్లా” అంది పిల్ల, 

“అసలీ పెట్లో కెందు కెక్కావు? ”

 “ఈ రైలు పట్నం పోద్దంటగా.”

 “చూడు పిల్లా. ఇది పరుపుల పెట్టి. వొచ్చి స్టేషనులో దిగిపోయి మరో పెట్లో ఎక్కు”

“ఏం?”

 “ఇది పరుపుల పెట్టెని చెప్పడంలా? మూడో క్లాసు పెట్లో ఎక్కాలి. నీ టిక్కట్టేది?”

 “అదేంటది?” 

“టిక్కట్టు కొనలేదా?”

ఆమె లేదన్నట్టు తలూపింది. 

ఇంకామెను ఏ ప్రశ్న లడిగినా ఏం లాభం లేదనుకున్నాడు. బెజవాడలో రైలాగ్గానే రైల్వే ఉద్యోగికి అప్పగించెయ్యొచ్చు ననుకున్నాడు.

“ఆ మూల కూర్చో.” 

ఆ పిల్ల కూర్చుంది. 

దక్షిణామూర్తి వెల్లగిల పడుకుని పత్రిక తిరగవెయ్యడం ఆరంభించాడు. అది మూసేసి మరో పత్రిక తెరిచాడు. కళ్ళు అక్షరాలని గుర్తు పట్టినా, అవి మనస్సుకి ఎక్కడం లేదు. ఏం చెయ్యడానికి తోచక ఆఖరుకి భోజనం చేసేద్దామని నిర్ణయించుకున్నాడు. బెర్తుమీద పత్రిక పరచి, సీటుమీద నున్న కారియర్ తీసాడు. గిన్నెలన్నీ విడదీశాడు. అబ్బో! పదిమందికి సరిపడా పెడుతుంది వెంకాయమ్మెప్పుడూ.

వెంకాయమ్మ క్షత్రియ వితంతువు. నిడదవోలు స్టేషన్ కి దగ్గరగా దక్షిణామూర్తికి పిత్రార్జితం ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో పూటకూటిల్లు నడుపుతోంది వెంకాయమ్మ. అతనెప్పుడు నిడదవోలు మీదుగా ప్రయాణం చేసినా, వెంకాయమ్మ కారియర్ లో భోజనం పంపుతుంటుంది. వంట మహా పసందుగా చేస్తుంది. అందులో ఈ వేళ కోడిపలావ్ కూడాను. బాగా ఉడికిన కోడి కండలు చూస్తూంటే నిగనిగ పొటమరించిన వెంకాయమ్మ వీపు మీది కండలు గుర్తుకొచ్చాయి అతనికి. వెంకాయమ్మ రవిక తొడుక్కోదు.  వితంతువు. 

ఆ వీపు, పక్కలూ ఎంత నున్నగా ఉంటాయో అతని వేళ్ళకి తెలుసు. 

ఆ స్థలం తాలూకు అద్దె మరోరకంగా వసూలు చేసిన ఘట్టాలు అతనికి గుర్తు కొచ్చాయి. అతనికి నవ్వొచ్చింది. తింటూ తింటూ నవ్విన మూలంగా అతను ముఖం పైకెత్తవలిసొచ్చింది – నోట్లో ముద్ద జారిపోకండా. మూల నున్న అమాయకపుకళ్ళకు అపచారం చేసి నట్టనిపించింది.

“ఆక లేస్తోందా.”

ఔనన్నట్టు ఆమె తలూపింది. ఒక గిన్నెలో కొంత పలావూ కూరా పెట్టి ఇచ్చాడు.. ఆమె ఆకలిగా తింది. ఆ దృశ్యం చూస్తూంటే దక్షిణామూర్తి మనసు ఎందుకో చివుక్కుమంది. మామూలుగా రైళ్ళలో ముషెత్తుకోడానికి అలవాటు పడ్డ రకం కాదని అతనికి అర్థమైంది. అన్నం తినేసి ఆమె అసహాయంగా నిలబడి ఉంటే, అతనన్నాడు.

“ఆ గదిలో కుళాయుంది. చెయ్యి కడుక్కురా.”

ఆమె తన చెయ్యి, తిన్న గిన్నే కడుక్కొచ్చింది. అతడు కూడా భోజనం పూరి చేశాక కారియరు సర్ది చెయ్యి కడుక్కొచ్చాడు. సిగరెట్టు ముట్టించాడు. చేతి సంచీ లోంచి పేక తీసి ఒక్కడూ ఆడుకోడం మొదలు పెట్టాడు. పేకాటలో మునిగిపోయాడు.

“అది ఇస్పేటు రాణీకదూ?” అంది ఆమె.

 “నీకు పేకముక్కలు తెలుసా?”

“ఓ. మా నాన్న రోజూ ఆడతాడు. సత్తెన్న మామ, పెద్దగాడు, రత్తయ్య అంతా వొచ్చి కూర్చుని ఆడతారు.”

“నాతో ఆడతావా?”

 “ఛా! పేక తాకితే పాపం.” 

దక్షిణామూర్తి తలెత్తి ఆ పిల్లవంక చూశాడు. ఎదురుగా ఉన్న బల్ల చెక్కని ఆనుకుని నిలబడి రైలు ఊపుకి అసహాయంగా ఊగుతోంది ఆ అమ్మాయి.

“ఎవరు చెప్పారు?” 

“మా యమ్మ.” 

“మరి మీ నాన్న ఆడతాడుగా?”

 “అందుకే మా అమ్మని కొడతాడు. ఓతూరి కాలిరిగిపోయింది మా యమ్మకి.”

దక్షిణామూర్తికి తనెన్నడూ చూడదలుచుకోని ఒకానొక దృశ్యం ముందు తొలిగిపోయింది. పేకాట ఆపి ఒక క్షణం ఆలోచించాడు.

“మీ నాన్న కేం పని?”

“తాగుడు, పేకాట. అందుకే అతన్నెవరూ పనికి పిలవరంట – మాయమ్మంది. ఓతూరేమో పెద కామందింట్లో బియ్యం దంపి మాయమ్మ నాలుగు రూపాయలు తెచ్చింది. అదేమో తనకిమ్మని తన్నాడు. అమ్మేమో నామీదికి గిరాటేత్తే, ఆ డబ్బుచ్చుకొని నేను లగెత్తా. నా ఎంట బడ్డాడు. పేటంతా తిప్పినా. రంగడడ్డాచ్చాడు గాని, లేకపోతే దొరకను. నా తల సెట్టునేసి కొట్టాడు. ఇందుగో దెబ్బ.”

ఎడం చెవి మీది జుట్టు తొలగించి చూపిందా పిల్ల. రెండంగుళాల మేర మానిన గాయం చూశాడు దక్షిణామూర్తి.

“నువ్వీ రైలెందు కెక్కావు?” 

“మా యమ్మ పట్టంలో వుందిగా మరి.” 

“పట్నం ఎందుకు వెళ్ళింది?”

“మాయయ్య మోటకత్తుచ్చుకొని తెగేశాడుగా మా యమ్మని. పట్టంలో ఆసుపత్రికి తీసుకుపోయారు.”

“మీ అయ్య?”

 “పోలీసోళ్ళు తీసుకుపోయారు బేడీలేసి. “

ఆ పిల్ల చెప్పిన కథ కాదు – దక్షిణామూర్తికి వింతగా తోస్తా – ఆమె ధోరణి. – కళ్ళయినా చెమ్మగిల్లలేదు. ఇంత దారుణం జరిగినా, దాని ఘాతుకత్వం ఆమె గహించినట్టు లేదు. దక్షిణామూర్తి పేక తీసేశాడు. పెట్టెలో పెట్టేశాడు. విజయవాడ వచ్చింది. 

కాని ఆ పిల్లని దిగిపొమ్మని అనలేదు. రైలు మళ్లీ కదిలాక బొమ్మల పత్రిక తీసి నడుం వాల్చాడు. ఆ పిల్ల అలాగే నిలబడి వుంది. .

“ఆ మూల పడుకో.” 

“నిద్దర్రాదు.” 

“ఏం?” 

“మా యమ్మ పాట పాడాలి.” 

“ఏం పాట?”

“వా సిట్టి తల్లీ, నిదరపోవమ్మా, 

రాసోరి పాపాయి రంగైనవోడు

సింతల్లో సెంద్రుడూ తొంగిసూసేడు

పుంతల్లో ఎలుతురూ పిండారబోసె 

పాకలో పాడావు పాలు సేపింది  –

పండుకో నా చిట్టి పండుకోవమ్మా…… నాకంతే వచ్చు.”

 “పా టింకా ఉందా?”

“నాకు నిద్దరొచ్చినా మా యమ్మ పాడతానే ఉంటదిగా, అదేంటది? బొమ్మల పుత్తకమా?”

“ఇలా కూచుని చూడు.”

అతడు కొంచెం జరిగాడు. అయితే ఆ పిల్ల కిందే కూచుని పత్రికలో బొమ్మలు చూసింది.

“నీ పేరేమిటి?” అన్నాడు పేజీలు తిరగవేస్తూ,

 “సిట్టితల్లి!” 

“మంచిపేరు.”

“ఈ బొమ్మేంటి?” అని అడిగింది. చిత్రంగా ముఖం పెట్టి.

 ఆ ముహూర్తంలో దక్షిణామూర్తికి ఆ పిల్లంత అందమైనది సృష్టిలో మరొకటి లేదనిపించింది. ఒక్కసారి ఆ పిల్ల  తలమీద చెయ్యేసి నిమరాలనిపించింది. కాని అంత సబబు కాదని తోచింది. మర్నాడు ఉదయం ఆ పిల్ల దారి ఆ పిల్లది, తన దారి తనది. ఆ రాత్రికి మట్టుకు తను ఆ పిల్లను ఆదుకున్నాడు, ఆకలి తీర్చాడు. టిక్కట్టు లేకండా పట్నం చేరుకోటానికి  సహాయపడుతున్నాడు. ఆ అనుబంధం అంతవరకే పెట్టుకోవాలి. 

ఈ సంగతి అనసూయకి  చెపితే ఏమంటుంది? అనసూయ కిది అర్ధంకాదు. చెయ్యకూడని పని చేశాననుకుంటుంది.  పోనీ పదిమంది చూస్తుండగా పేదలకు సహాయం చెయ్యడమా కాదిది. అల్లాంటి సేవ ఉబుసుపోకకి అనసూయ చేస్తుంటుంది. కూలిపేటల్లోకి వెళ్ళి వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు నేర్పుతుంది. వాళ్ళ చంటిపాపలికి నీళ్ళుపోసి పాలు పట్టిస్తుంది. అయితే, కూడా పత్రికలు తాలూకు ఫోటోగ్రాఫరుంటాడు. ఆమె ఆ పనులు చేస్తుండగా రకరకాల కోణాలు ఛాయాచిత్రాలు తీసి పత్రికల్లో వేయిస్తాడు. ఆ మురికి కంపు భరించినందుకు ప్రతిఫలంగా ఆమె కీర్తి ప్రచారమౌతుంది. 

ఏకాంతంగా ఒక రైలు పెట్టెలో ఒక అనాధకి చేసిన మేలు ఎందుకూ పనికి రానిది. బూడిదలో పోసిన పన్నీరు. 

ఈ చిట్టితల్లి వల్ల తను పొందిన సంతృప్తి కూడా ఒకటుంది. ఈ ఒంటరి ప్రయాణంలో తోడు కావడం ఒకటే కాదు; చిన్న అమాయక ప్రశ్నలద్వార నవ్వొచ్చే కొన్ని నిర్వచనాల ద్వారా, కటిక వ్యాపారస్తుడైన తనవంటి వాడికి ఓ కొత్త అనుభవం కలిగించింది. లాభనష్టాలతో నిమిత్తంలేని అనుభవం అది. దానికి విలువ లేదని దక్షిణామూర్తికి తెలుసు. 

అతని మనస్సు వర్తక వాణిజ్యాలకు బందీకాదు, వాటికి యజమాని. నయాపైసలూ, రూపాయిల ప్రపంచానికీ బయటుండే విలువలు అతనికి తెలుసు. అంచేతే అతను వ్యాపారస్థులలో అగ్రగణ్యుడు. అంచేతే ఆ విలువలకు రూపాయలు, నయా పైసలలో వెలకట్టగలడు. అనసూయను కూడా అతను వెల కట్టేశాడు.

“ఏమిటి చూస్తున్నావు చిట్టీ.” అన్నాడు దక్షిణామూర్తి. అతను పరధ్యానంగా ఆలోచిస్తున్నప్పుడు చిట్టితల్లి అతని చేతిలో బొమ్మల పత్రిక తీసుకుని కాళ్ళమీద పరుచుకుని చూస్తోంది.

“ఈ కుక్క మాటాడగలదా?”

 “ఏం?”

 “దాని నోట్లోంచి ఎవ్వో మాట లొత్తన్నాయిగా?” 

“నిజమే, మాట్టాడుతోంది?

” ఏటంటాది?”

 “ఆ గోడనున్నది తినేదేనా అనుకుంటోంది.” 

“పిచ్చి కుక్క” 

“ఏం?”

 “అది టోపీగా, ఎట్టా తింటాది?” 

“కుక్కగదా, దానికేం తెలుసు?”

 “మరి మా కావేరి కెన్ని తెలుసో తెలుసా?”

 “కావేరెవరు?”

“మా కుక్క మా అయ్య కల్లుముంత దరికేనా పోదు; పక్కింటి పోతురాజు కల్లు మట్టుకు నాకేత్తాది. మా ఎదురింటి ఆడపిల్లని పట్టుకుని ఏడిపిత్తాది. నే నెక్కడి కెల్లినా కూడా వొత్తాది, టేసనుకి కూడా వొచ్చింది. పెట్టిలో కెక్కకుండా తలుపు మూసేశా.” |

మా ఇంటి పక్క నుంటాడు. మిల్లు కామందుగారి డైవరు. ఆడికి కారుంది. తాగేసినప్పుడూరికే కామందుగారి పెళ్ళాం ఊసే. పోతుమామకి డబ్బిత్తాదంట. నామీద పడతాది. దూది బత్తా లాగ – డోకంటాడు పోతుమామ. మిల్లు కామందు మడుగులో పడి సచ్చిపోతే పోతుమామని పోలీసోళ్ళట్టుకుపోయారు. పోతుమామ మంచోడు. మాయమ్మని కొడతావుంటే మా అయ్యని సందేటేసి పట్టుకుని వాడు, కదలకుండా.

పెదమణిసి. రంగత్త దూళ్ళసాల కూలిపోయింది గాలోనకి. లేగదూడుంది పాపం. పోతుమామ ఒంటి సేత్తో కూలిపోయిన పాక నెత్తిపట్టుకున్నాడు. ఆవునీ దూడనీ ఇంట్లో కటేసిందా రేత్రి. పోతుమామ శానా మంచోడు. వొద్దన్నా సరే మా యమకి పావలా  అర్థా  ఇచ్చి వోడు. ఒకో రోజు బియ్యానికి లేకపోతే..” –

దక్షిణామూర్తి రెండు చేతులూ తలకింద పెట్టుకుని చిట్టితల్లి ఇల్లూ పరిసరాలూ ఊహించుకోవడం మొదలు పెట్టాడు.

ఆ పిల్ల చెప్పుకుంటూ పోతోంది. చటుక్కున ఆమెకేసంగతి జ్ఞాపకం వొస్తే అందులోకి దాటేస్తుంది. మొదలు పెట్టిన ఘట్టం పూర్తి చెయ్యకుండానే మరో ఘట్టంలోకి పోతుంది. రకరకాల పేర్లు. ఆడ, మగ వచ్చిపోతున్నాయి. వాళ్లెవరో ఆమె వివరించి చెప్పదు. అయినా ఆమె వివరిస్తున్న కథలో ఒక పరిపూర్ణతుంది. 

అతని మనస్సులో అతిస్పష్టమైన చిత్రంగా అది క్రమంగా రూపుదాల్చింది. అటువంటి గుడిసెలు, అటువంటి వ్యక్తులు, తనబోటి వాళ్లు ఎన్నోసార్లు చూసి ఉండవచ్చు. వాళ్ల కథలు రకరకాలుగా విని ఉండవచ్చు. కాని నాలుగయిదేళ్ల ఆ పసిపాప వివరించినంత స్పష్టంగా ఆ కథను ఎన్నడూ వినలేదు, ఇక ముందు వినబోడు. ఆమె చిన్ని మాటలలో తను ఎరగని వింత ప్రపంచకం పరుచుకుంది. ఆ వ్యక్తుల్ని ఆ వాతావరణాన్ని మననం చేసుకుంటుండగా అతనికి నిద్రపట్టింది. అతి ప్రశాంతమైన నిద్ర; ప్రగాఢమైన నిద్ర.

అతనికి మెలకువ వచ్చేసరికి పెట్టి తలుపు తెరిచుంది. అవతల పొద్దుటి కనుచీకటిలో కంటి కలవాటుపడ్డ పట్నం దృశ్యాలు మసగ్గా కనబడ్డాయి. గుమ్మంలో సందేహిస్తూ నిలబడ్డాడు ఇంటి నౌకరు, దొర. ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు దక్షిణామూర్తి. దొర పక్క చుట్టేస్తూ అన్నాడు. 

“చిన్న శెట్టియా రొచ్చారు సార్.”

 “ఎక్కడికీ?” 

“ప్లాట్ఫారం మీదున్నారు సార్.”

ఒకసారి బాత్ రూములోకి వెళ్ళి ముఖం చన్నీళ్ళతో కడిగి తుడుచుకున్నాడు. తల దువ్వుకున్నాడు. దొర తెచ్చిన కాఫీ తాగాడు. 

ఈలోగా దొర, సామానంతా కూలీచేత మోయించుకుపోయాడు. 

ఆ తరువాత అతను పెట్టెలోంచి దిగాడు. దిగగానే చిన్న శెట్టి కాళ్ళమీద పడ్డాడు. ఇంత జన సమూహంలో ఈ దృశ్యం జరిగినందుకు దక్షిణామూర్తికి కోపం చిరాకు పుట్టుకొచ్చాయి.

చెట్టియార్, పదిమందిలో ఈ పని చేశావంటే నిన్ను దుంపనాశనం చేస్తాను. లే ముందు.” 

చెట్టియార్ లేచాడు. దక్షిణామూర్తి అతి తొందరగా బయటికి నడుస్తుంటే చెట్టియార్ కూడా పడ్డాడు.

“పొరబాటయింది సామీ! మీ సొమ్ము నయా పైసాతో ఇస్తును. ఏదో మా తమ్ముడుండాడే, వాడి బుద్ధి మంచిది కాదు. నాక్కూడా తెలియదు, సిమెంటని సెప్పి  వట్టి బూడిద బస్తాల్లో నింపి మీకిచ్చినాడని. మీ తోడు. మీరు ఊరిలో లేరు. మీ వకీల్  నా మీద అరస్టు వారంటు తీసినాడు. పదిమంది బిడ్డలవాండ్లము. ఈ తూరి దయ చూపించారంటే…”

“పదకొండు గంటలకు పోయి మా వకీలును చూడండి.” 

“నిన్నసూస్తిని. అతను నిండా కోపంగా…” 

“ఈవేళ పదకొండు గంటలకు వెళ్లి చూడండి.”

 “తమరుదా దయ తలిస్తే….”

“చెపుతుంటే మీక్కాదూ, పదకొండు గంటలకి వెళ్ళి చూడమని. ఇంకొక్కడుగు నా వెనకాల వేశారంటే, ఈ రైల్వే పోలీసులచేతే మిమ్మల్ని అరస్టు చేయిస్తాను…. ఇక వెళ్ళండి.”

తన్నులు తిన్న కుక్కలాగా వెళ్ళిపోయాడు చెట్టియార్. తన్ను మోసగించిన వాళ్ళమీద తన కెల్లాంటి అధికార మొస్తుందో దక్షిణామూర్తికి బాగా తెలుసు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నాశనం చెయ్యగలడతను. వాళ్లు తన చేతి కీలుబొమ్మలు. వాళ్లని శిక్షించడంలో అతని కేమి పెద్ద సంతృప్తి ఉండి కాదు. వాళ్ళు సంపూర్ణంగా తన దయమీద ఆధారపడి ఉండేటంతవరకూ తీసుకొస్తే, అతని కొక సంతృప్తి. దానివల్ల అతని సమర్థత అతనికే రుజువవుతుంది. వాళ్ళు వచ్చి తన కాళ్ళు పట్టుకోవడం అతనికి చాలా ఇష్టం. అయితే పదిమందిలో కాదు.

చెట్టియార్ ఆడిన నాటకం, అతని తమ్ముణ్ణి విడదీసి, లంచం ఇచ్చి, అతనిచేత కోర్టులో అన్నగారికి వ్యతిరేకంగా సాక్ష్యమిప్పించడం, చెట్టియార్ దగాకోరని కోర్టువారికి రుజువు కావడం, అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ అతను కారుదగ్గరకు వచ్చాడు. వెనక తలుపు డ్రైవరు తెరిచాడు. అతను ఎక్కి కూచున్నాడు. డ్రైవరు తలుపు ముయ్యబోతుంటే అడ్డొచ్చింది  చిట్టితల్లి . 

నిద్రలేవగానే ఏదో మరిచిపోయినట్టనిపించిందతనికి. ఇంతలో చెట్టియార్ సంఘటనవల్ల అది పూర్తిగా మరిచిపోయాడు. కాని చిట్టితల్లి కనబడగానే తను మరిచిపోయింది ఆమేనని గుర్తుకొచ్చింది…

అయితే, రాత్రి రైలు పెట్టిలో ఏకాంతంగా ఆమెతో ఎంత ఆంతర్యం ఏర్పడ్డా, తన పగటి జీవితంలో ఆమె ప్రవేశించడం మాత్రం అతని కిష్టం లేదు. కొంచెం చిరాగ్గానే అడిగాడు.

“ఏం చిట్టీ?”

“మా అమ్మ దగ్గరకి తీసుకెళ్లవా!” అంది దీనంగా చిట్టితల్లి. 

“ఫో,ఫో” అంటూ లాగెయ్యబోయాడు దొర.. 

“ఉండు దొరా!” అన్నాడు దక్షిణామూర్తి. “మీ అమ్మెక్కడుంది?”

 “ఏమో!”

 “ఎప్పుడొచ్చింది పట్నానికి?”

 “నిన్న పొద్దున్న.”

“ఏ రైలుమీద?”

 “రైలుమీద కాదు. రెండు గడలు పోడుగ్గా ఏసి, మద్దినేమో సిన్న సిన్న ముక్కలేసి, ఓ మంచం కింద కట్టి దానిమీద మోసుకొచ్చారు. మా నాన్నని పోలీసులు పట్టుకుపోయారుగా! అందుకని సీతయ్యబాబు ముంతలో నిప్పు పట్టుకుని ముందెళ్ళాడు.” 

దక్షిణామూర్తి గుండె గతుక్కుమంది..

 “పట్నం వొచ్చిందని ఎందు కనుకున్నావు.”

“రంగత్త సెప్పిందిగా. నేను మా యమ్మతో కూడా పోతానని ఏడితే సెప్పింది. పట్నం ఆస్పత్రికి తీసుకుపోతున్నారు. బాగవగానే తిరిగొత్తాదిలే అంది. తనింటికి తీసుకుపోయి కూడెట్టింది. తినేసి నేను జారుకున్నాను. పట్టం పోడ మెట్టా గంటే సోడా సాయిబ్బన్నాడు – ఆ రైలెక్కితే సీదా పట్టం పోతాదని. ఎక్కేశా.”

ఒక క్షణంపాటు దక్షిణామూర్తికి నోటమాట రాలేదు. కళ్ళలో చెమ్మ కనబడకుండా తుడుచుకుని అన్నాడు.

“ఎక్కు కారెక్కు” ఆమె కారెక్కింది. కారు కదిలింది.

షినాయి నగర్‌లో పెద్ద బంగళా అతనిది. దారిపొడుగునా చిట్టితల్లి ఏదో అడుగుతూనే ఉంది. దక్షిణామూర్తి పరధ్యానంగా సమాధానాలు చెపుతున్నాడు. ఆఖరుకి కారు పెద్ద ఇనుప తలుపులను దాటి గుండ్రటి రోడ్డు వెంట తన ఇంటి ముందు పోర్టికోలో అగేవరకూ అతనొక నిశ్చయానికి రాలేకపోయాడు.

చిట్టితల్లి నేం చేయాలి?

ఆమె కెలాగో సహాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. తెరచిన కారు తలుపు పక్క నిలబడి, అమాయకంగా ఆమె చెప్పిన కథ విన్నప్పుడు అతని వ్యక్తిత్వం ఆపాద మస్తకమూ నీరయిపోయింది. ఆ ముహూర్తంలో ఆమెను కారెక్కమనడం తప్ప మరో ఆలోచన అతని మనస్సులోకి రాలేదు. కాని జరిగినకథ వింటే అనసూయ అతడు చేసినపని హర్షించదు. అనసూయే కాదు, అతని స్నేహితులూ, ఆప్తులూ ఎవరూ హర్షించరు. ఆమెను చూసి జాలిపడ్డం, పదో పదిహేనో చేతిలో పెట్టడం – అంతవరకూ మాత్రం అతని కర్తవ్యమూ, విధీ అని అంతా ఒప్పుకుంటారు. కాని ముక్కూ మెగం ఎరగని ఒక అనాధ బాలికను కార్లో ఎక్కించి ఇంటికి తీసుకురావడం – అదిమట్టుకు అందరికీ వింతగా తోస్తుంది. అందులో తనలాంటి ఆరితేరిన వ్యాపారస్తుడు చెయ్యవలసిన పనికాదు. ఇది వింటే సాటివాళ్ళు అతని అతని మతి భ్రమించిదనుకుంటారు. అతని వ్యాపారానికే కాదు, అతని పేరు ప్రతిష్ఠలకే దెబ్బ. అయితే ఆ పసిపాపను వీధిపాలు చెయ్యడానికి అతనికి మనసొప్పలేదు. పోర్టికోలో ఆగిన కారులోంచి అతను దిగకుండానే తోటమాలి గుడిసె దగ్గరకు నడపమన్నాడు డ్రైవరుని. తీరా తను దిగాక తనకోసం ఎవరన్నా డ్రాయింగు రూములో వేచి ఉంటే వాళ్ళకీ పిల్లను గురించిన సముజాయిసీ అంతా చెప్పుకోవాలి.

తన ఇంట్లో తనే ఏదో దొంగతనం చేస్తున్నట్టనిపించిం దతనికి. ఒక వంక అనసూయనీ, మరోవంక చిట్టితల్లినీ కూడా ఏదో మోసగిస్తున్నట్టు అతని మనస్సు పీకింది. కాని గుండె నిబ్బర పరుచుకుని, తోటమాలిని పిలిచాడు.

“ఆర్ముగం! ఈ పిల్లని నీ ఇంట్లో పెట్టుకుని, పెట్టూ పోతా చూస్తుండు.” 

“ఎత్తనినాళ్ళు సార్” అని అడిగాడు ఆర్ముగం.

“నేను చెప్పేదాకా, తెలిసిందా. దొరగారికి అన్ని వివరాలతో చెప్పాలగావునేం?  నీ పిల్లలతో సమంగా చూస్తుండు.. ఆమెకేమన్నా లోటొచ్చిందా! జాగ్రత్త.” 

తోటమాలిమీద కోప్పడి, ఆమె విషయం అంత కచ్చితంగా అతనితో ఏర్పాటు  చేశాక, అతని మనసులో ఇంతవరకూ అలజడి పెడుతున్న ఆందోళన కొంత తగ్గింది. ఆమె ఎడల తన కర్తవ్యాన్ని నెరవేర్చానని సంతృప్తిపడ్డాడు.

“ఆఫీసులో అడిగి డబ్బు తీసుకుని ఆ పిల్లకి గుడ్డలు కుట్టించు” అని చెప్పి  డ్రైవరుని కారు షెడ్డులో పెట్టమని, ఇంటివేపు నడిచి వెళ్ళాడు. సావకాశంగా ఆ పిల్లని  ఒక అనాధ శరణాలయంలో జేర్పించేస్తే, సమస్య అన్నివిధాలా పరిష్కారమై పోతుందని నిర్ణయించుకున్నాడు.

ఆ తరువాత పని తొందరలో ఆ పిల్ల విషయం పూర్తిగా మరిచిపోయాడు. అన్నిటికన్నా ముఖ్యమయిన పని అతని పెళ్ళి..

అతను సరదాగా గడిపొద్దామని విశాఖపట్టణానికి బయలుదేరిన రోజునే, అనసూయ తండ్రికి గుండె జబ్బు సూచనలు కనిపించాయట. అనసూయ పట్టుబట్టి ఆ వార్త అతని కందకుండా ఆపించింది. 

ఒకటి – ఏదో విశ్రాంతికోసం వెళ్ళినతన్ని వెంటనే తగినంత కారణం లేనిదే రప్పించడం న్యాయం కాదనీ; రెండు – తన తండ్రి గుండెజబ్బు అంత ప్రమాదమైనది కాదనీ. 

అయితే అనసూయ తండ్రి మాత్రం ఒక వాగ్దానం పుచ్చుకున్నాడు. దక్షిణామూర్తి తిరిగొచ్చిన వెంటనే అతనికీ అనసూయకీ పెళ్లి జరిగిపోవాలని. నర్సింగ్ హోమ్ లో తమ ఆస్థాన జ్యోతిష్యుల్ని రప్పించడం, ఇద్దరి జాతకాలూ చూసి, ముహూర్తం నిర్ణయించడం. అన్నీ దక్షిణామూర్తి ఊరికి చేరుకోకుండానే జరిగిపోయాయి. మొదట అతనికి కొంత చిరాకు కలిగింది. తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగినందుకు.

“సరే, నీ కిష్టం లేకపోతే వొద్దని నాన్నతో చెప్పేస్తానులే, ఇందులో బలవంత మేముంది?” అంది అనసూయ.

“ఆ! అదేమన్నమాట, ఇప్పుడు. పెళ్ళి వాయిదా వేస్తానంటే మాత్రం నే నొప్పుకుంటానా?” అన్నాడు ఛలోక్తిగా దక్షిణామూర్తి – 

తను చిరాకు పడ్డందుకు అనసూయకి కోపం వచ్చిందని గ్రహించి, ఆమెను దగ్గరగా తీసుకుని పెదవులమీద ముద్దు పెట్టుకున్నాడు కూడా. అంత చనువు ఆమె ఇవ్వడం – తను తీసుకోవడం అదే

మొదటిసారి. ఆమె ఎంత నవయువతి అయినా కొన్నింటి విషయంలో మాత్రం మహాపాతకాలపు మనిషి.

ముహూర్తం సరిగ్గా వారం రోజులైనా లేకపోవడం మూలాన అతనికీ ఆమెకూ కూడా నిద్రా విశ్రాంతి లేదు. వ్యాపార విషయాలన్నీ వాయిదావేసి రోజుకి ఇరవై నాలుగు గంటలూ పనిచేసినా పెళ్ళి ఏర్పాట్లు పూర్తయ్యేట్లు కనబడలేదు. బంగారు నగలు బహిరంగంగా చేయించడానికి వీల్లేదు గనుక, అతని ఇంట్లో సరుకు గదిలో ఆ కార్ఖానా  ఏర్పాటు చెయ్యాల్సి వచ్చింది. రెండువేపులా పిలుపులు, ఆహ్వాన పత్రాలు వగైరా 

మామగారు నర్సింగ్ హోమ్ లో ఉన్నారు; ఆయన వంక మగదక్షత లేదుఒక్కగా నొక్క కూతురు. తమ్ముళ్ళన్నీ , వాళ్ళ పిల్లల్ని ఆయన నమ్మలేదు – ముఖ్యంగా డబ్బు విషయంలో..

అన్నిటికన్నా ఎక్కువకాలం తినేసింది – పెళ్ళిబట్టల ఎన్నిక. 

ఆమెకు కొనవలసిన చీరలు ఆమెనే ఎంచుకోమన్నాడు దక్షిణామూర్తి,

“బాగుంది. కట్టుకునేదాన్ని నే నయినా, అనుక్షణం చూసేవాడివి నువ్వు, నీకు నచ్చి తీరాలి.”

బట్టల దుకాణంలో అడుగు పెడితే, ఒకపూట గడిచిపోయింది, ఒక్క చీరయినా ఎంచకుండానే. పెళ్ళిలోగా ఈ చీరలు కొనడం ఎల్లాగా పూర్తికాదని నిరాశ చేసుకున్నాడు దక్షిణామూర్తి. 

కాని రేపు పెళ్ళనగా సేలం వెళ్ళి ఆఖరి చీరలు కొనేసి, రాత్రి పదిన్నరకి ఇంటికి తిరిగొచ్చేసరికి, ఫరవాలేదు రేపు పెళ్ళి జరుగుతుందన్న నమ్మకం కలిగిందతనికి. 

వచ్చిరావడంతోటే సోఫాలో కూలబడి కన్ను మూశాడు. పెద్దగాలివానకి అలసి విశ్రమిస్తున్న ప్రకృతిలాగుంది అతని స్థితి. అప్పుడొచ్చి చెప్పాడు దొర.

“ఆ పొన్ను  కనబడలేదు సార్.” – 

“ఏ పొన్ను”

“తోటకారన్ కి మీరిచ్చిన పొన్ను సార్. ఆ దినం మీతో కార్లో ….” 

“ఏమయింది?” “పొద్దున్న తొమ్మిది గంటలకి చూసినాడంట, ఆ తరువాత చూణ్ణే లేదంట.” 

దక్షిణామూర్తికి తనేదో తప్పు చేసినట్టనిపించింది. “ఆర్ముగాన్నిలా పిలు.”

ఆర్ముగం వచ్చాడు. అతన పెళ్ళాం వొచ్చింది. ఇంటిముందు పందిరి వెయ్యడానికి కుదిర్చిన కూలీలందరూ వచ్చారు. అన్ని పోలీస్ స్టేషన్లకీ ఫోన్ మోగింది. ప్రతి అయిదు నిమిషాలకీ వాకబులు. ఎదురుగా కనిపించిన వాణ్ణి తిరిగి తిరిగి అదే ప్రశ్న అడగడం. దక్షిణామూర్తి అందర్నీ తిట్టాడు – తన కప్పగించిన పిల్ల మాయమైనందుకు ఆర్ముగాన్నీ, ఆమె ఎక్కడికి పోయిందో జాగ్రత్తగా చూడనందుకు దొరనీ, ఆమెను పట్టుకోలేకపోయినందుకు పోలీసుల్నీ. పై అధికారులందరూ నిద్ర మేలుకున్నారు – హోమ్ శాఖ మంత్రిగారిద్వారా. అందరూ టెలిఫోన్ల వద్ద కూచున్నారు, చిట్టితల్లి కబురుకోసం. 

ఒక్క అనసూయకి మాత్రం అతడు ఫోన్ చెయ్యలేదు. ఆ క్షణంలో అతడు అనసూయ సంగతే మరిచిపోయాడు.

రాత్రి పన్నెండు దాటినా చిట్టితల్లి కబురు తెలియలేదు. దక్షిణామూర్తికి ఆందోళన ఎక్కువైంది. ఈ మహాపట్నం ఆ పసిపాపను మింగేసిందా?

ఆర్ముగం తన పిల్లలు ఆరుగుర్నీ నిద్రలేపి తీసుకొచ్చాడు. అందర్నీ తిరిగి తిరిగి విచారించాడు దక్షిణామూర్తి. కొన్ని అతనికి మరీ బాధ కలిగించిన వివరాలు దాటేశేవాడు.

 ఉదాహరణకి: మూడు రోజుల క్రితం అతడూ అనసూయా బయటికి పోడానికి కార్లో బయలుదేరినప్పుడు దారి కడ్డంగా నిలబడిందట చిట్టితల్లి, ఆర్ముగం ఆమె నోరుమూసి ఒక గుబురు పక్కకి లాగేశాట్ట – అయ్యగారికి ఆమె ఏడుపు వింటే కోపమొస్తుందని.

అతన్ని చూడ్డానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసిందట. గుమ్మం లోపల అడుగు పెట్టకుండానే  అవతలికి ఈడ్చి పారేశాడట దొర. 

“మా అమ్మ దగ్గరికి తీసికెల్తానన్నాడు. నన్నొదులు.” అని గింజుకునేదట  వీళ్ళు పట్టుకుంటే.

వాళ్ళతో ఎంత గట్టిగా మాట్లాడినా, ఎవర్నీ నిజంగా తిట్టలేకపోయాడు దక్షిణామూర్తి. ఎందుకో వాళ్ళలా చేసినందుకు నిజంగా బాధ్యత తనదే ననిపించి దతనికి.

మరో రోజున ఆర్ముగం చేతిలోంచి విడిపించుకుని అరుస్తూ తన కారు వెనకాలు పరిగెత్తుకుంటూ వచ్చిందట. పందిరేస్తున్న ఆసామీ ఒకడు వెనకాల వెళ్లి ఆమెను పట్టుకుని  తీసుకొచ్చి తిరిగి ఆర్ముగానికి అప్పగించాడట.

ఇంక చిట్టితల్లి దొరకదన్న నిస్పృహ అతని మనస్సులో ఆవరిస్తున్న సమయంలో ఆర్ముగం మూడో కొడుకు చెప్పిన ఒక సంగతి గుర్తుకొచ్చింది.

అక్కడే పడుకుని నిద్రపోతున్న బాబుని బలవంతంగా ఊపి లేపాడు దక్షిణామూర్తి, ఈ దిక్కులేని పిల్లకోసం తన యజమాని పడుతున్న ఆందోళన నౌకర్ల కెవరికీ అర్థం కాలేదు.

“ఏంరా బాలూ! పొద్దున్న ఏమిటి చూశానన్నావు? నువ్వూ చిట్టీ కలసి ఎక్కడికి పోయారు? ఇందాక ఏమిటన్నావు? చెప్పు.” అని ఆత్రంగా అడిగాడు.

“పాడకట్టసార్. పొణం సార్ పొణం” అన్నాడు బాలు సగం మగతలో. 

“ఎక్కడ? శవాన్ని ఎటు తీసుకుపోయారు?” “అమింజికలై పక్కమా సార్.”

 “డ్రైవర్! కారు తియ్యి – తొందరగా….”

డ్రైవర్ షెడ్ తలుపు తెరిచి కారు ఇవతలికి తీసేదాకా అతనికి తొందర ఆగలేదు. తనే షెడ్ దగ్గరకు పరుగెత్తాడు. తనే కారు స్టార్టు  చేసి బుర్రుమని శరవేగంతో వీధిలోకి తిప్పాడు. 

ఎవరో మోసుకుపోతున్న శవం చూసింది. తన తల్లి నలాగే తీసుకుపోయారు. ఆ శవంతో పోతే తన తల్లి తప్పకుండా కనబడుతుందని గంపెడాశతో బయలుదేరింది. చిట్టిపాప. పూనమల్లి హైరోడ్డులోకి కారు తిప్పుతుంటే టైర్లు కిర్రుమన్నాయి. ఒక లారీనీ, ఒక రిక్షానీ భయపెట్టి కారు పూనమల్లి వేపు స్థిరపడింది. వంతెన దాటిం తరవాత వేగం తగ్గించాడు. కుడిచేతి పక్కనున్న సర్చిలైటు వెలిగించి ఆ స్మశానం అంతా వెతుకుతూ మెల్లగా కారు నడుపుతున్నాడు. 

నిర్మానుష్కమైన ఆ స్మశానంలో, ఆ కటికి చీకట్లో – ఏకాకిగా నిస్సహాయంగా దూరంగా కూర్చుని వుంది – ఒక చిన్న ప్రాణి. ఆమె చిట్టితల్లి అని గుర్తు పట్టాడు దక్షిణామూర్తి. 

తన తల్లిని వెతుక్కుంటూ మద్రాసు వచ్చింది. తన తల్లిని వెతుక్కుంటూ స్మశానంలోకి వచ్చింది. తల్లి లేదనీ, ఎక్కడా లేదనీ, తనకింక కనబడదనీ తెలుసుకుంది. తల్లి లేని లోకం స్మశానం. ఆ స్మశానంలో ఒంటరిగా కూర్చుంది. ఆ దృశ్యం కనబడగానే దక్షిణామూర్తికి లోపల ఎక్కడో విపరీతమైన బాధ పుట్టింది. అల్లాగే స్టీరింగు చక్రంమీద కళ్ళు మూసి వాలాడు. మెల్లగా కారు తలుపు తెరిచాడు. స్మశాన నిశ్శబ్దాన్ని భంగపరచకుండా జోళ్ళు విదిలించి పారేసి వట్టి పాదాలతో నడిచాడు – కారు దీపాలయినా ఆర్పకుండా. 

వీటి వెనక ఒక క్షణం నిలబడ్డాడు; మెల్లగా వంగాడు. కూర్చున్నాడు. చేతులు చుటూ వేశాడు. 

ఆమె ఒక్కసారి ఉవ్వెత్తుగా లేచింది. “నన్నొదిలేసెయ్. మీరంతా దొంగలు. నన్ను ముట్టుకోకు – నన్నొదిలేసెయ్.”

 “చిట్టీ” అన్నాడు! మెల్లగా, మృదువుగా… 

అబద్దాలాడారు  నాతో – రంగత్తా, నువ్వూ అంతా. మా అమ్మని అల్లాగే కాల్చేత్తే – ఆస్పత్రిలో ఉందన్నారు, పట్నంలో ఉందన్నారు. ఎందుకన్నారు? మా అమ్మ ఇంకా లేదంటగా. ఇంకసలు రాదంటగా. ఉందని ఎందుకన్నారు నాతో – నాతో అబద్దాలేదుకాడారు  మీ రంతా? రంగత్తా, నువ్వూ – అంతా?” 

మాటమాటకీ మధ్య ఎగుపుల్లో, ఆకస్మికంగా తగిలిన గాయం రక్తం చిందుతోంది. ఆమెలో, ఆకస్మికంగా కలిగిన జ్ఞానం కత్తిలా ఇంకా కోస్తోంది. దక్షిణామూర్తికి తెలుసు, ఆ గాయాన్ని ఓదార్పులు మాన్పలేవని.

చిట్టి తల్లిని భుజంమీద వేసుకున్నాడు. కాలుతున్న చితుల మధ్య కాలిబాటవెంట రోడ్డు వేపు నడిచాడు. చిట్టితల్లి ఎగుపులు క్రమంగా సన్నగిల్లాయి. ఆమె ఎడంచెయ్యి అతని కంఠాన్ని చుట్టుకుంది – ఇంక జీవితాంతం వదలని బంధంలాగా..

కారు తలుపు తెరిచి చిట్టిని లోపల సీటు మీదికి దింపాడు. అప్పుడు చూశాడు చిట్టి తల్లి నిద్ర పోయిందని. ఆమె శరీరం వశం తప్పి సీటు మీద పడిపోయింది. ఉదయం తొమ్మిది గంటల నించి ఈ నాలుగోఝూము రాత్రి వరకు ఆ లేత మనస్సులో ఎన్ని ఉప్పెనలు చెలరేగాయో ఊహించుకోగానే అతని ఒళ్ళు జలదరించింది. తలుపు మెల్లగా మూసి, డ్రైవరు సీటు వేపు కొచ్చాడు. ఒక్కసారి దిగంతం వరకూ పరుచుకున్న స్మశానం వేపు చూశాడు. మెల్లగా కారులో ఎక్కి తలుపు మూశాడు. పరధ్యానంగా ఇంటికి నడిపించాడు కారు.

మిగతావాళ్ళు చిట్టి తల్లిని తియ్యబోతోంటే వారించాడు. తనే ఎత్తుకుని వెళ్ళి లోపల సోఫాలో పడుకోబెట్టాడు.

పక్కనున్న ఫోను తీసి అలవాటైన నంబరొకటి డయల్ చేశాడు. కొంత సేపటికి – ఎంతో సేపటికి పరిచయమయిన కంఠం నిద్రమత్తులో బరువుగా పలికింది.

“డార్లింగ్! ఏమి టింత రాత్రివేళ?” అంత రాత్రివేళ అతడు తప్ప మరెవ్వరూ ఫోన్ చెయ్యరని ఆమెకు తెలుసు. –

“నువ్వు తక్షణం ఇక్కడికి రావాలి.”

 “రేపు పెళ్ళన్న సంగతి మరిచిపోయావా?”

“లేదుగనకే రమ్మంటున్నాను. నువ్వు వచ్చి తీరాలి. నీకో ముఖ్యమైన బహుమానం ఇవ్వదలిచాను…. అది నువ్వు అంగీకరించాలి.”

“ఏమిటది?”

“నువ్వు రాగానే చూపిస్తాను” అతడు ఫోన్ పెట్టేశాడు. ఆమె వస్తుందని తెలుసు. అతని చెయ్యి అప్రయత్నంగా చిట్టితల్లి తల నిమురింది, అనసూయతో మాట్టాడినంతసేపూ. ఫోన్ పెట్టేసాడు.  అనసూయతో చెప్పదలుచుకున్న మాటలు మననం చేసుకున్నాడు.

“అనసూయ! ముందీ చిట్టితల్లికి నువ్వు తల్లివి కావాలి. అయితేనే నాకు భార్యవు కాగలవు.” 

అతని హృదయంలో అమితమైన ప్రశాంతి నిండింది.

(యువ దీపావళి సంచిక)

“‘చిట్టి తల్లి’ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!” కి 8 స్పందనలు

    1. కథ నిడివి 10 నిమిషాల కు మించకుండా ఉంటే బాగుంటుంది.
      అలాంటి కథలను ఎంపిక చెయ్యడం, లేదా చేసిన వాటిని ఎడిట్ చెయ్యడం

      1. హర్షణీయం Avatar
        హర్షణీయం

        గొప్ప కథలు (క్లాసిక్స్) అనబడే వాటిల్లో చాలా మటుకు ఎక్కువ నిడివి వుండే కథలే వుంటున్నాయండీ. వాటిల్లో వుండే ప్రతి వాక్యం, కథకు బలాన్ని చేకూర్చేటట్లుగా రచయిత రాయటం జరుగుతుంది. వాటిని ఉన్నది ఉన్నట్లుగానే ప్రెసెంట్ చెయ్యడం అనేది మేము ఏర్పరుచుకున్న నియమం. కాకపోతే రెండు మూడు భాగాలుగా ప్రెసెంట్ చెయ్యడానికి ప్రయత్నిస్తాము.

  1. కధా చిత్రాన్ని మలచడంలో పద్మరాజు గారు ఆయనకు ఆయనే సాటి. ఈ కధని  అందించినందుకు మీకు కృతజ్ఞతలు.

    1. హర్షణీయం Avatar
      హర్షణీయం

      Thank you Sir.

Leave a Reply to హర్షణీయంCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading