Apple PodcastsSpotifyGoogle Podcasts

శ్రీరమణ గారు – బంగారు మురుగు

తెలుగు వారికి శ్రీ శ్రీ రమణ గారు కథా రచయిత గా , కాలమిస్ట్ గా , సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు.

బంగారు మురుగు – శ్రీ రమణ గారు రచించిన ‘మిధునం ‘ కథా సంకలనం లోనిది.

ఒక బామ్మ గారు, మనవణ్ణి తన ప్రాణానికి ప్రాణంలా ఎలా చూసుకుంది? తన తదనంతరం అదే ప్రేమను అందించడానికి, తన బంగారాన్ని, ఇంకో యోగ్యురాలైన వ్యక్తి చేతికి ఎలా అందించిందీ ? అనేదే ఈ కథలో ముఖ్యాంశం.

ఇప్పటిదాకా ఆయన కేవలం ఒక పాతిక కథలు మాత్రమే రాసారు. ఈ కథ చదివిన తర్వాత, సుప్రసిద్ధ రచయిత , సాహితీ వేత్త శ్రీ ఆరుద్ర గారు ఏవన్నారంటే , ” కడిమి చెట్టు పన్నెండేళ్లకోసారి పూస్తుంది. ఇదిగో ఇప్పుడు శ్రీరమణ పూశాడు. ఆ కురింజి పేరు ‘బంగారు మురుగు’ “

హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ప్రసారం అయ్యే శ్రీ శ్రీరమణ గారి ఇంటర్వ్యూలో , ఈ కథ గురించి మరిన్ని వివరాలు మనం తెల్సుకోవచ్చు.

ఇంటర్వ్యూ కు , వారి కథలు/వ్యాసాలూ ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ రమణ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

ఈ పుస్తకం మీరు కొనడానికి, కావాల్సిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో చివర ఇవ్వబడ్డాయి.

బంగారు మురుగు:

నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్లు.

మా అమ్మానాన్న ఎప్పుడూ పూజలూ పునస్కారాలూ, మళ్ళూ దేవుళ్ళూ గొడవల్లో వుండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులూ ఎత్తే పల్లకీ, దింపే పల్లకీలతో మా ఇల్లు మరంలా వుండేది. అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ – నే దగ్గరకు వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది.

బామ్మకి యీ గొడవలేం పట్టేవి కావు. అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే. ఓకంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం.

పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ వేధింపులూ బామ్మ దగ్గర లేవు. ఎవరేనా “ఈ ముసలమ్మకి భయమూ భక్తీ రెండూ లేవు…” అంటే – “దయకంటే పుణ్యంలేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టడం – నాకు తెలిసిందివే “అనేది.

బామ్మకి పుట్టింటి వాళ్ళిచ్చిన భూమి నాలుగైదెకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది. మా ఊరికి పది కోసుల దూరం. ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించటానికి రైతులు వచ్చేవాళ్ళు . వచ్చీ రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది. పుట్టిన ఊరు విశేషాలన్నీ గుక్క తిప్పుకోకుండా అడిగేది. వాళ్ళు బదులుచెప్పకుండానే మళ్ళీ ప్రశ్న – ప్రశ్న మీద ప్రశ్న వర్షం కురిపించేది. రైతులేమొ పంట తెగుళ్ళగురించి, అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలో బేడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకు వచ్చే వాళ్ళు. ఆ మాట ఎత్తడానికి బామ్మ అవకాశం యిస్తేనా ?

“ఎండన పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండరా” అనేసి వడ్డన ఏర్పాట్లలో పడిపోయేది. విస్తరి వేసిందగ్గర్నించి పెరుగు అన్నంలోకి వచ్చేదాకా వాళ్ళతో ఊరివాళ్ళ కబుర్లన్నీ వాగించేది.

తీరా పెరుగన్నం చివర్లో “ఏరా అబ్బీ, యీ ఏడాది పంటలెలా వున్నాయిరా ” అని అడిగేది.

వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయేది. కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని, పైగా తిన్న విస్తరి ముందు కూచుని “పంటలు పోయాయి” అని చెప్పడానికి నోరాడక “ఫర్వాదేదమ్మా దేవుడి దయవల్ల” అనేవాళ్ళు. ఇంకేం చేస్తారు పాపం అణా పైసలతో శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్లు. వెళ్లేప్పుడు “ఇదిగో బుల్లి పంతులూ! మీ అవ్వ గట్టి పిండమే !” అని ఎగతాళి చేసి వెళ్ళే వాళ్ళు.

బడికి వెళ్ళనని మారాం చేసినపుడల్లా బామ్మ నాకు అండగా వుండేది. “పసి వెధవ, గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు- అయినా ఒక్కగానొక్కడు బతకలేక పోతాడా…” అంటూ నన్ను చంకన వేసుకు బయటకు నడిచేది.

మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు వుండేది. అది మా స్థావరం. రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం. బాదంచెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు వుండేది. రాలిన పండు ఆకులు విస్తరి కుట్టుకుని బామ్మ భోజనం చేసేది. దాని చుట్టూ చిన్న మట్టిఅరుగు వుండేది. “దీన్ని కాపరానికొచ్చేప్పుడు మా పుట్టించినించి తెచ్చా… అప్పుడు జానాబెత్తెడుండేది… నువ్ నమ్మవ్… పిచ్చి ముండకి మూడే ఆకులు బుల్లి బుల్లివి వుండేవి…” రోజు ఒకసారైనా ఈ మాట నాకు చెప్పేది. నే కాపరానికొచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చి మొద్దుకి అన్నేళ్లు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా.

ఇప్పటికీ బామ్మ చెంబెడు నీళ్ళు దానికి పోస్తూనే వుంటుంది. మానుకి రెండు తొర్రలుండేవి. పై తొర్రలో రెండు రామచిలకలు కిలకిలలాడుతూ కాపరం చేస్తుండేవి. ఇంకో తొర్రలో బామ్మ నాకోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాల వుండేది. నీడన ఆవుదూడ కట్టేసి వుండేది. దానికి బామ్మ పచ్చి పరకలు వేస్తూ వుండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నాచేత బాదం పప్పులు తినిపించేది. – ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడూ నీడా – ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకు పడుకుని కునుకు తీస్తుండేవాణ్ణి. “అసలే నడుం వంగిపోయె… పైగా ఆ మూట కూడా దేనికి” – అని మా అమ్మ అంటే “వాడు బరువేంటే. వాడు వీపున లేపోతే ముగ్గు పడదే తల్లీ – చూపు ఆనదే అమ్మా” అనేది బామ్మ.

సమస్త దేవుళ్ళకీ మేలుకొలుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్నీ ముగ్గుతో కలిపేది. అప్పుడు మా మండువా లోగిలి నిండుగా పమిటకప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువులా వుండేది. “పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్లు లేవరా” అని అడిగితే “పిచ్చి సన్నాసీ దేవుళ్ళు నిద్దరోతారా! దేవుడు నిద్దరోతే యింకేమైనా వుందీ-! మేలుకొలుపులూ మనకోసమే చక్రపొంగలీ మనకోసమే” అనేది బామ్మ.

తెల్లారగానే నూనె రాసి, నలుగు పెట్టి కాకరపందిరికింద ముక్కాలిపీట మీద కూచోపెట్టి వేడినీళ్ళు పోసేది. “చిక్కిపోయాడమ్మా పిల్లాడు… పొడుగు సాగుతున్నాడో ఏమో” అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులుపడేది. ఒంటి మీద చిన్న గాటో, దెబ్బో, పొక్కో కనిపిస్తే “అఘాయిత్యం వెధవ్వి ఎక్కడ తగిలించుకున్నావ్” అని గారాబంగా కేకలేసి తెగ దిగులుపడిపోయేది. నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది.

నెలకోసారి భజంత్రీవాడు వచ్చేవాడు బాదం చెట్టుకింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం. ముందు నావంతు.

“ఒరేవ్ జాగ్రత్తగా చెయ్ – పిల్లాడి క్రాపు తెల్లదొర క్రాపింగ్ లా వుండాలి” అని హెచ్చరికలూ, సలహాలూ యిస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ. అయినా వాడి పద్ధతిలో వాడు తిరపతి మెట్లతో డిప్ప కొట్టుడు కొట్టేసేవాడు. తనవంతు వచ్చినపుడు చేతిన వున్న బంగారుమురుగుతీసి నా చేతికి తొడిగేది. స్నానం చేశాక కుంకుడురసంతో ఆ బంగారు మరుగుకి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది. మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది.

బజారు చిరుతిళ్లు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష వుండేది. ఆరోగ్యం కంటె కుటుంబమర్యాద దెబ్బ తింటుందని- నాకవేం తెలిసేవి కావు. బెల్లపు జీళ్లు, పీచుమిఠాయి, జంతికలు, తేగలూ కొనుక్కు తినాలని నాలిక పీకేది. బామ్మని అడిగితే “ఓస్ అంతేకదాపద” అనేసి కోరినన్ని కొనిపెట్టేది. మరికొన్ని బాదంచెట్టు భోషాణంలో దాచిపెట్టేది.

బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత!

మనవడికి అడ్డమైన గడ్డీ కొనిపెడ్తోందని తెలిసిబామ్మకి డబ్బు దొరక్కుండా ఇంట్లో కట్టడి చేశారు దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి.

బామ్మ మీద నిఘా వేసినా నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తోంది. బియ్యం ఒళ్లో పోసుకొచ్చి జీళ్లు తేగలూ నైవేద్యం పెట్టేది నాకు. అదీ తెలిసిపోయింది. బియ్యం డబ్బాకి తాళం పడింది. దాంతో నా నోటికి కూడా, అత్తగారి ఆటకట్టిందని అమ్మ సంతోషించింది.

” ఇంటి దీపానివి, చక్రవర్తివి , నీకీ కరువేంటి నాయనా” అని బామ్మ బాధపడింది.

ఆరోజు పీచుమిరాయివాడు ఊళ్లోకి వచ్చాడు. వాడు రోజు రాడు. సంతరోజు మాత్రమే వస్తాడు. మూడువైపులా రేకు, ఓవైపు సరుకు కనిపించేలా అద్దం వున్న డబ్బా -విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయి పొత్తులు – వాడు డబ్బా చప్పుడు చేస్తూ “పిచ్మిరా” అని చిత్రంగా అరుస్తూ వీధిన వెళ్తుంటే నా నోరెంత వూరిందో బళ్లో వున్న నాకు తెలుసు- ఇంట్లో వున్న మా బామ్మకి తెలుసు. “పిచ్మిరా” అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ ఎక్కువవుతోంది. ఆక్షణంలో బామ్మ బడిగుమ్మంలో ప్రత్యక్షమైంది.

పంతులుగారు ప్రభవ విభవలు చెప్పిస్తున్నారు. బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర రక్కున వల్లింపు ఆగి తరగతి నిశ్శబ్దం అయింది. నరసింహం పంతులుగారంటే గండభేరుండం! పిల్లలూ పెద్దలూ హడిలి చచ్చేవారు. ఆయనకి బుర్రమీసాలు, కళ్లద్దాలు, గుండూ పిలక, చేతిలో బెత్తం, నాలుగువైపులా చూడగల మిడిగుడ్లూ వుండేవి. మా బామ్మ బడిగుమ్మంలోకి వస్తూనే “ఒరే నరసింహా, నా మనవణ్ణి పంపరా” అంది. ఆయన నా వైపు చూసి పోరా అనే లోగానే పలకా పుస్తకంతో నిలబడి వున్నాను. “పో…” అనడమేమిటి తొర్రలో రామచిలకలా తుర్రున దాటుకున్నాను.

అవతల వీధి చివర పీచ్మిఠ వాడు నా కోసమే నిలబడి వున్నాడు. అప్పటికే వాడితో బేరసారాలు పూర్తిచేసింది బామ్మ. రెండు మిఠాయి పొత్తులూ, నాలుగు పుంజీల జీళ్లు ఇప్పించింది. జీళ్లు జేబులో పోసుకుని, బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు రెండూ మింగేశాను. ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతిలా అయిపోయింది.

“ఈ మొహంతో ఇంటికెళ్తే ఏవన్నా వుందీ..” అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి, బడిగంట కొట్టాక బావిదగ్గర మూతి కడిగి, కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది.

తెల్లారి పొద్దున దేవతార్చనలో వుండే బుల్లి కంచుగంట కనిపించలేదని అమ్మ కంగారుగా వెదికేస్తోంది.

“ఎక్కడికి పోతుంది… ఎలికముండలు లాక్కెళ్ళి వుంటాయి…” అని బామ్మ పట్టీ పట్టనట్టు సద్దేస్తూ మాట్లాడుతోంది.

“అయినా ఎలికలు గంటనేం చేసుకుంటాయి బామ్మా” అంటే “పిల్లికి కడతాయ్… వెధవాయ్…” అని అరిచి నా నోరు నొక్కి బయటకులాక్కెళ్ళింది.

తొర్రలో దాచుకున్న నాలుగు పుంజీల జీళ్లు రెండ్రోజుల్లో పూర్తయినాయి.

మళ్లీ సంతరోజు వచ్చింది. ఇంట్లో పెద్ద గాలిదుమారం లేచింది. నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలా నిలబడి వుంది. వాకిట్లో పీచుమిరాయి వాడు నిలబడి వున్నాడు. క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట యిచ్చిందట. ఆ లెబ్బల్లో వాడు మనకి నాలుగు మిరాయిలు, ఆరుపుంజీల జీళ్ళు ఇంకా బాకీ వున్నాట్ట! అవి యిచ్చేసి వెళ్తామని సరాసరి వాడు ఇంటికి వచ్చాడు. అదీ గొడవ. సడీచప్పుడు చెయ్యదనుకున్న గంట గణగణా బామ్మ గుండెల్లో మోగింది.

“దేవుడి గంటనే పాపభీతి కూడా లేకపోయె…” అంది అమ్మ నిష్ఠూరంగా.

“అంత పాపభీతి పడాల్సిందేముందీ… అయినా ఘంటలో వుంటాడా దేవుడు…. పసివాళ్ళ బొజ్జలో వుంటాడుగాని…” బామ్మ సాయకారం తీసింది.

“ఈ మెట్ట వేదాంతాలకేం లెండి… ఇట్లాగే వదిలేస్తే అవ్వా మనవడూ కలిసి ఆ చేతిమురుగు కూడా కరిగించేసుకు తింటారు.” అంది అమ్మ , నాన్న కి బోధపడాలని. నాన్న కలిగించుకు మాట్లాడేలోగా బామ్మ, కోపంగా గొణుక్కుంటూ చరచరా వెళ్లి బాదం చెట్టుకింద కూచుంది. నేను వెనకే భయం భయంగా వెళ్ళా… కొంచెం దూరంగా నిలబడ్డా.

…” నువ్వు కాదుగాని……. నీతో నా చావుకొచ్చిందిరా. ఇన్నేళ్ళోచ్చి ఆహరికి నా బతుకు దొంగ బతుకైపోయింది… ఫో అసలు నా చాయలకి రావద్దు… మీ అమ్మా నాన్నావున్నారుగా… వాళ్ళతోనే వూరేగు… నాది అనుకుంటే దుఃఖం… కాదు అనుకుంటే సుఖం…” అంటూ బామ్మ బావురుమని ఏడ్చింది.

కంటి ధార ఎండిన బాదం ఆకులమీద టపటపా రాలాయి. పిడుగులు రాలున్నంత చప్పుడు నా చెవికి… దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది… దిక్క లేని వాళ్ళకి?

ఒక్కసారి బేర్ మని పెద్దగా ఏడ్చాను.

బామ్మ తటాలున చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది. అక్కడే చెట్టుకింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకు పడుకుంది. నేను బామ్మ పక్కనే వొదిగి దిగాలుగా కూచున్నా, బామ్మ గుర్రుపెట్టి నిద్రపోయింది. బామ్మ మీద గండుచీమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ –

వెన్ను మీద చెయ్యివేసి నా పక్కలో కూచునే బామ్మలా కూచున్నాను. కాకి రాల్చిన రెండు బాదంకాయలు గుండుమీద పడితే బామ్మ ఉలిక్కిపడి లేచింది. నాకు నవ్వొచ్చింది. సంగతి అర్ధంకాగానే బామ్మ కూడా పక్కున నవ్వింది. ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్నా వరించింది.

రాలిన బాదంకాయల్ని పప్పులు వొలిచే పనిలో పడింది. “ఒరే, మీ అమ్మకి ఈ మురుగు చెరిపించి ఒక జత ఒంటిమిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పట్నించో ఆశ… చూశావా అటు తిప్పి ఇటుతిప్పి… బోడిగుండుకీ బొటనవేలుకీ ముడిపెట్టినట్టు…ధోరణి నా నగమీదికి లాగింది…” బాదంపప్పులు పెడుతూ బామ్మ మాటలు.

నాకు అర్ధం కాకపోయినా “ఔనౌను…’ అన్నాను ఆరిందాలాగా ఆమెని సంతోషపెట్టడానికి

దసరా రోజులు వచ్చాయి.

ఒక పెద్ద పీఠం మందీ మార్బలంతో మా ఇంట్లో దిగింది. స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలక్కలు, గున్న ఏనుగు, నాలుగు ఆవులూ వాటి దూడలూ, జింకపిల్ల, రెండుపల్లకీలు, ఇవిగాక బోలెడు సాధన సామాగ్రి నాలుగు గూడు బళ్ళ నిండా దిగాయి.

ఇల్లంతా ఆక్రమించుకుని సిపాయిల్లాగా వాళ్ళే ఎక్కడెక్కడ ఏమేమిటి ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు. నేను, బామ్మ పరాయివాళ్లలా చోద్యం చూస్తున్నాం.

” ఇవాల్టినించి మన కొంప సర్కస్ డేరా అనుకో” అంది బామ్మ.

వాళ్లు మాట్లాడే భాష కూడా చిత్రంగా వుంది. మా నాన్నని ‘గృహస్థు’ అని పిలిచేవాళ్ళు. సామాజికులు, పూర్ణదీక్షాపరులు, శిష్యపరమాణువులు, పాదరేణువులు… ఏమిటో నాకు అర్ధంకాని మాటలు చాలా వినిపించేవి.

అంటే ఏవిటని బామ్మని అడిగితే ‘అంతా మనుషులేరా అబ్బీ- వుత్తినే… అదో ఆడంబరం” అన్నది బామ్మ.

గున్న ఏనుగుకి రోజు బెల్లం బుట్ట. అరటిపళ్ళ గెల అందించేవారు. దాని సేవకి ఇద్దరు మావటీలు, శ్రీ మావటీ గారిని మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఏనుగు ఎక్కించాలని బామ్మ తంటాలు పడ్డది కాని వారు సాధ్యపడదన్నారు. పల్లకీలపైన వుండే శాటిన్ వస్త్రం చుట్టేసి, పల్లకీలని దేవిడీలో జాగ్రత్త చేశారు.

పల్లకి ఎక్కించమని హటం చేస్తే “ఆ సన్నాసి పల్లకీ మనకెందుకురా- నీ పెళ్ళికి దీని జేజెమ్మ లాంటి పూసల పల్లకీ పెట్టించి ఊరూ, పేటా ఊరేగిస్తా…” అని బామ్మ సముదాయించింది. అందరూ నిద్దర్లు పోయాక సాములారి జింకచర్మం మీద నన్ను కాసేపు పడుకోపెట్టింది బామ్మ. బలె మెత్తగా నూ, తమాషాగానూ వుంది. జింకపిల్లతో ఆడుకోవాలనిపించేది కాని బామ్మ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా వుంచేది.

మా ఇంట్లో అర్చనలూ, దీక్షలూ, హోమాలూ ఘోటకంగా సాగుతున్నాయి. వచ్చే పోయే భక్తులు, బంధువులు అంతా కోలాహలంగా వుంది.

స్వామివారు వెండి రేకులు తాపడం చేసిన సిహాసనం మీద కూచుని తావళం తిప్పుతూ వుండేవారు. ఎప్పుడూ గంభీరంగా వుండేవారు. ఎప్పుడేనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులికి. అలౌకిక విషయాల్లోనూ, లౌకిక వ్యవహారాల్లో కూడాతలదూర్చేవారు. వంటలూ – పిండివంటలూ, కూరలూ, పులుసులూ అన్నీ ఏమేం ఎట్లా చెయ్యాలో ఆయనే చెప్పేవారు.

చెప్పడం అనకూడదుట ఆదేశించారు అనాలిట! చుట్టానికి వచ్చారనకూడదు దర్శనానికి వచ్చారనాలిట.

“పాదాలివ్వండి స్వామీ” అని ప్రాధేయపడేవాళ్ళు. వాళ్ళకి ప్రాప్తం వుంటే పాదాలిచ్చేవారు. లేనివాళ్ళు పాంకోళ్ళకి మొక్కి వెళ్ళిపోతుండేవారు.

సాములారు భోజనం చేశాక (అపచారం, భిక్ష స్వీకరించాక)వెండి గొలుసుల ఉయ్యాలబల్లమీద పట్టు బాలీసుల మీద వాలి అరమోడ్పు కన్ను లతో భుక్తాయాసం తీర్చుకునేవారు.

వింజామరలు విసరడానికి మేవంటే మేమని వంతులకోసం పోట్లాడుకునేవాళ్ళు భక్తులు.

“జార్జి చక్రవర్తిదే భోగం – మళ్లీ మీ స్వామివారిదే భోగం” అనేది శిష్యుల దగ్గర మా బామ్మ. వాళ్ళు దానికెంతో గర్వపడేవాళ్ళు.

సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు. అర్ధం అయినా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవాళ్ళు. అయ్యవారికి శాలువలు, అమ్మవారికి పట్టువస్త్రాలు, పళ్లు, రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు.

ఒకరోజు శిల్కులాల్చీ, నాలుగు వేళ్ళకీ ఉంగరాలు, మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబ్బండి దిగాడొక భక్తుడు. వస్తూనే స్వామి వారి పాదాలమీద వాలాడుస్వామివారు వాత్సల్యంతో వందనం స్వీకరించారు.

జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని “ఎట్లా వుందిరా వ్యాపారం” అని అడిగారు.

“అంతా తమ దయ”అన్నాడా భక్తుడు.

“రాహువు ఇల్లు మారుతున్నాడు. ఇక నీకు తిరుగులేదురా పట్టిందంతా బంగారమే” అన్నారు స్వామి భక్తుడి చేతులు వదిలిపెడుతూ – భక్తుడి నడిమి వేలునున్నఎర్రరాయి వుంగరం స్వామి చేతిలోకి వచ్చింది.

పక్కనే వున్న శిష్యుడి దోసిట్లో వేసి “అమ్మవారికి ముక్కెర చేయించండి” అని చిరునవ్వుతో ఆదేశించారు. ఆ భక్తుడికి వేలు వూడినంత బాధ కలిగింది. పెదాలు తడారిపోయినాయి. బిక్కచచ్చి “తమ చిత్తం” అన్నాడు ఎప్పటికో తేరుకుని.

“కాదు తల్లి ఆజ్ఞ” అన్నారు స్వామి గంభీరంగా.

మనోవాక్కాయ కర్మలమీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు. బామ్మ నవ్వాపుకోలేక సభలోంచి జారుకుంది. శిష్యుడు ఎదురైతే “మీ దేవుడికి పట్టిందంతా బంగారమే” అని ఎగతాళి చేసింది.

లోగడ విడిది చేసినపుడు ఆయన చూపు బామ్మ బంగారుమురుగు మీదపడిందిట. “తల్లి చిట్టికాసులపేరు కావాలని గోల చేస్తోంది- నువ్వు చెయ్యివిదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా…” అన్నారుట స్వామి బామ్మతో- “అయ్యో… ఆ తల్లికి నేనిచ్చే పాటిదాన్నా సాక్షాత్తూ మహాలక్ష్మి ఆమెకేం తక్కువస్వామీ” అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందట.

“ఒరేవ్ హనుమంతుడి ముందా కుప్పిగంతులు? ఇచ్చేదాన్నయితే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకొచ్చి సొరాజ్జెమ్ కోసం జోలెపట్టిన రోజే యిద్దును కదా… మహా మహా ఆయనకే ఇవ్వలేదు… ఈ సర్కస్ కంపెనీకి యిస్తానా…” అంది బామ్మ.

అది తీర్ధప్రసాదాల సమయం.

భక్తులంతా కాళ్ళకి మొక్కి, తీర్ధం పుచ్చుకుని మళ్ళీ మొక్కి వెళ్తున్నారు. నేనూ వెళ్ళి చెయ్యి జాపా. స్వాములారు హూగ్రంగా గుడ్లురిమి “పో అవతలికి ” అని గసిరారు. చొక్కా తొడుక్కుని మొక్కడం, తీర్ధాలు తీసుకోడం మహాపచారంట! ఇంకేముంది కొంపలు మునిగి పోయినట్టు అందరూ హాహాకారాలు చేయడం మొదలెట్టారు. ఆ సందట్లో నా లాగూ చొక్కా విప్పేసి ఒంటిమీద నూలుపోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు. అయినా ఆయన కటాక్షించలేదు. నన్ను బయటకి పంపెయ్యమని తీర్ధపు శంఖుతో సైగచేశారు. తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే – మరీ రెచ్చిపోయి “ఇవ్వాళ అమృతం ఎవరికీ ప్రాప్తం లేదు… అపచారానికి ప్రాయశ్చిత్తం…” అన్నారు కఠినంగా – శంఖుకింద పెట్టేసి తావళం అందుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు.

భక్తులు, శిష్యులు అంతా నన్ను దోషిని చూసినట్టు చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న మానాన్నలో సహనం చచ్చిపోయింది. నన్ను బయటికి బరబరా లాక్కెళ్ళి, పూనకం వచ్చిన మనిషిలా చావకొట్టారు. ఒంటిమీద అచ్చాదన కూడా లేదేమో వొళ్ళంతా వాతలు తేలాయి. గుక్కపెట్టి పరుగెత్తాను. బామ్మ పరుగు పరుగున ఎదురొచ్చి రెండు చేతులా నన్నెత్తుకుని గుండెలకు పొదువుకుంది. భయం, బాధ, ఉక్రోషం, ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ వెయ్యి చేతులు నాకోసం జాపిన అమ్మవారిలా కన్పించింది- గబగబా బాదంచెట్టు కిందకి తీసుకెళ్లింది వాతలు చూసింది. వలవలా ఏడ్చింది. ఒళ్ళంతా నిమిరింది. పై కొంగు కప్పింది. “ఆ బడుద్ధాయికి నిన్ను కొట్టేందుకు చేతులెలా వచ్చాయిరా దూర్వాసపు పుటకా వాడూనూ…” అంటూ నాన్నని తిట్టింది. నా ఏడుపు ఎక్కిళ్ళ స్థాయికి తగ్గింది.

బామ్మ మాత్రం బుసలు కొడుతోంది. ఇంతలో స్వాములారి అంతరంగిక శిష్యుడు ముడిధోవతులు ఆరెయ్యడానికి పెరడువైపు వచ్చాడు.

“దీక్షితులు ఇట్రా” అని గద్దింపుగా పిలిచింది. ఆ పిలుపుకి ఆయన వులిక్కిపడ్డాడు. ఆ సంబోధన… ఆ ధాటీ – దీక్షితులు గారంటే స్వాములోరి తర్వాత స్వాములారంతటివాడు. పెద్దాయన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వేళావేళలు, కళాకళలూ అన్నీ తెలిసినవాడు. స్వామివారికి జలుబుచేస్తే దీక్షితులు గారికి తుమ్ములు వస్తాయి. అలాంటిది వారి సంబంధం – దీక్షితులు సంకోచిస్తూనే నాలుగడుగులు బామ్మ వైపు వేశాడు .

“ఏం స్వాములారయ్యా బోడి సాములారు… పసివెధవకి ఎలా వాతలు తేలాయో చూడు… పైన చొక్కా వుంటేనే అంట్ల వెధవ అయిపోయాడా అభం శుభం తెలీని పసిబిడ్డ….? ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పుండాకోర్లు చాలా మందున్నారు మీ గుంపులో… చేతనైతే వాళ్ళ చర్మాలు వొలిపించి తీర్థాలు పోయమను. వూరిఖే బృహదారణ్యాలు భగవద్గీతలూ వల్లిస్తే లాభం లేదు… మానికతో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా? దంచాలి వండాలి తినాలి హరాయించుకోవాలి- అప్పుడొస్తుంది బలం… ఔనా? మీ పీరాయ్ కి చెప్పు… నాకేం భయం లేదు… వాడి బోడి శాపం నన్నేం చేయదు…” – బుసలు కొట్టే బామ్మ మాటలకి దీక్షితులు బుర్ర తిరిగిపోయింది. పిలక తడుముకుంటూ పిల్లిలా జారుకున్నాడు. అయినా బామ్మ ఆగలేదు.

“ధిక్కారము సైతునా అని వేమూరి గగ్గయ్యలా, గుడ్లూ వీడూనూ…పిచికమీద బ్రహ్మాస్త్రం అనీ… ఒక పక్క నించి ఎకరాలు హరించిపోతున్నా తెలీడం లేదు… అరిశెల్ని అప్పాల్ని వదల్లేనివాడు అరిషడ్వర్గాల్నేం వదుల్తాడు…” స్వాములారిని, మా నాన్న ని కలగలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంటదాకా బామ్మ తిడుతూనే వుంది.

రాత్రి అమ్మ నన్ను గట్టిగా కరుచుకుని కంటినిండా ఏడ్చింది. నూనె రాసింది. నాన్న రోజంతా అన్నం తినలేదు.

“ముందే వుండాలి నిగ్రహం… ఉపోషం వుంటే పిల్లాడి వాతలు పోతాయా… అంత తామసం కూడదు” అని బామ్మ మందలించింది. తలదించుకున్నారు గాని నాన్న మారు మాట్లాడలేదు.

స్వాములారి మీద కాదు యావత్తు పీఠం మీద బామ్మ కత్తి కట్టింది. పాకశాలలో వంటవాడి మీద దాష్టీకం చేసి నాలుగు చిట్టిగారెలు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా నాచేతతినిపించింది. దీక్షితుల్ని పనిమాలా పిలిచి “ఇదిగో మహా నివేదన కాకుండానే చిట్టిగారెలు పిల్లాడికి పెట్టా….చెప్పుకో దిక్కున్నచోట.. మొక్కకి చెంబుడు నీళ్ళు పొయ్యడం… పక్షికి గుప్పెడు గింజలు జల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్న వాడికి పట్టెడన్నం పెట్టడం ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం-” సవాలు చేసింది బామ్మ, పాపం దీక్షితులకి బామ్మంటే సింహస్వప్నం అయింది – ఎప్పుడు పిలిపిస్తుందో తెలీదు – ఏం తిడుతుందో తెలీదు.

రెండోరోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూచోపెట్టు కున్నారు స్వామి వారు.

జామపండు యిచ్చి “మొత్తం తినాల్రా” అని తినిపించారు. నాకు పులిమీద కూచున్నట్టుంది. రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి. అయినా ఎటూ కదలడానికి లేదు. తర్వాత మరికాస్త ముద్దుచేసి వారి పాంకోళ్ళు తొడిగించి నడవమన్నారు. నేను రక రకా చప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే “ఏవమ్మో, నీ మనవడు బాలకృష్ణుడు…” అన్నారు స్వాములారు పెద్దగా నవ్వుతూ, శిష్యులంతా ఆమోదిస్తున్నట్టు ముఖాలు వికసింపచేశారు.

“అంతా తమరి వాత్సల్యం. పసివాడి అదృష్టం” అంది బామ్మ. ఈ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నాడు.

ఆ పీఠం మరోచోటికి తరలింది.

బామ్మ మేలుకొలుపులు పాడుతూనే వుంది. ముగ్గులు వేస్తూనే వుంది. కాని నా చిన్న తనం బామ్మ వీపు మీంచిజారిపోయింది. నా కంచం నాదే – నా మంచం నాదే. హైస్కూలు చదువులో పడ్డాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందనీ, నాకు వడకపోగు వెయ్యాలనీ నిర్ణయించారు.

వారం ముందుగానే సందడి ప్రారంభమైంది. గురుపరంపరతో బాటు బంధువులతో ఇల్లు నిండింది. మా అత్తయ్య, మామయ్య వాళ్ళమ్మాయి కల్యాణి వచ్చారు. కల్యాణికి పదేళ్ళుంటాయి. ప్రతి ఇంట్లోలాగే మేనత్త కూతురు కాబట్టి “నీ పెళ్లాం వచ్చిందిరోయ్” అని పాత సరసం ఆడారందరూ.

అత్తయ్య వస్తూనే బామ్మని చూసి “ఏమిటే అమ్మా అంతగా చిక్కిపోయావ్…” అని బాధ నటించింది.

“నేను చిక్కేదాన్ని కాదు లేవే ఎవరికీ – నువ్వు బాధపడకు” అంది వ్యంగ్యంగా బామ్మ.

“చూడు… ఆ చేతులు పుల్లల్లాగా అయిపోయాయ్… బావిలో చేద వేసినపుడు ఆ మురుగు జారి నూతిలో పడ్తుందేమో చూసుకో…” – సలహాగా అత్తయ్య అంటే

“నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు… చచ్చినా నా చేతి మురుగు నీకివ్వను…” తెగేసినట్టు అన్నది బామ్మ.

అత్తయ్య కస్సున లేచింది ఆ మాటకి. “అంటే నీ ముష్టి మురుగు కోసం పడి చస్తున్నానా” “ముష్ఠిది కాదది బంగారపుది – సువీ అంటే రోకలి పోటని తెలుసులేవే…” అందిబామ్మ.

“ఒక్కగానొక్క ఆడపిల్లని… కన్న కూతుర్ని … దయాపేక్షలు లేవు. మీ పెట్టుపోతలకి మేం ఎప్పుడైనా ఏడ్చామా….” అని గద్గద స్వరంతో అత్తయ్య విజృంభించింది.

తల్లీ కూతుళ్ళ వాదులాట విని అమ్మ లోపల్లోపల ఆనందపడ్డది. మాటా మాటా మరీ పెరక్కుండా నాన్న సర్దుబాటు చేశారు.

నా చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు.

మెడలో జందెపు పోగు, చెవులకి బంగారు పోగులు నాకు కొత్త అలంకారాలైనాయి.

బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతోంది. తొర్రలో పాత చిలకలు ఎగిరిపోయి కొత్త చిలకలు వచ్చి వాలున్నాయి. బామ్మకి అరణంగా యిచ్చిన ఆవుదూడకి అయిదో కారు దూడ పుట్టింది.

కంటిచూపు తగ్గినా బాగా చెయ్యి తిరిగిన బామ్మ ముగ్గులు గడితప్పకుండా వేస్తూనేవుంది…

పీఠాధిపతుల తాకిడి తగ్గింది. తాతలనాటి క్షేత్రాలు తరిగిపోయాయి. అంటుమామిడి తోట గృహస్థు పేరు మీద లేదిప్పుడు. దేవిడీకి గోడలు తప్ప పైపెంకులు లేవు. ఒంట్లో ఓపిక తగ్గినా బామ్మ మాట చురుకు తగ్గలేదు

“మా ఉయ్యాల వెండి గొలుసుల్ని గున్న ఏనుగు మింగేసింది” అని చాలా సరసంగా చెప్పి నవ్వేది.

అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది. తడి చీరెల శిక్ష తప్పింది. నాన్న నిర్లిప్తంగా వుంటున్నారు. అప్పటి వైభవం లేదు, అట్లాగని దరిద్రమూ లేదు. నాకు తెలిసిన వైభవం బామ్మ – బాదంచెట్టూ అని ఇప్పుడూ వున్నాయి. “నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం” బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అన్పించింది.

నా ఎఫ్.ఎ.పూర్తయింది. బందర్ లో సర్కారు ఉద్యోగం వచ్చింది.

అయినవీ కానివీ పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది. మేనత్త కూతురు కల్యాణి ప్రస్తావన వచ్చింది. కాని బామ్మ ససేమిరా వద్దంది.

“ఆ పిల్ల పేరుకి కళ్యాణేగాని వుత్త నత్తగవ్వ – దాని తల్లి గడుసు దయ్యం – దాంతో నువ్వా సుఖపడలేవ్- పరాయి సంబంధమే చేసుకుందాం” అని బామ్మ స్పష్టంగా చెప్పింది. అత్తయ్యా వాళ్ళు కూడా నా కాళ్ళు కడిగి పిల్లనివ్వడానికి, పుట్టింటి బంధం నిలిచిపోవాలనీ ఏ మాత్రం ఆరాటపడలేదు. వాళ్లకి ఒక్కతే పిల్ల. పైపెచ్చు కావలసినంత వున్న వాళ్ళు. మాకిప్పుడు ఈనాములూ లేవు, నేను బారిస్టర్ నీ కాదు.

చూసిన రెండు మూడు సంబంధాల్లో – చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులుగారి ద్వారా వచ్చిన సంబంధం నచ్చింది.

బామ్మకి మరీ నచ్చింది. తాంబూలాల దాకా వచ్చాక నాలుగు కాసుల బంగారం దగ్గర తేడా వచ్చింది. అటూ యిటూ నరసింహం గారు మాటలు నడిపారు గాని చివరికది చినికి చినికి గాలివాన అయింది. పెద్దవాళ్ళ మధ్య సొమ్ము కంటె పంతాలు అడొచ్చాయి.

“పిల్ల పొందిగ్గా వుందిరా…పచ్చగా దొరసానిలా వుంది… కళ్ళు కజ్జికాయల్లా వున్నాయి… నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు…” అంటూ బామ్మ తెగ వూరించడం మొదలుపెట్టింది.

లోపల పంతం పెట్టుకుని పైకి మాత్రం ‘వాడిష్టం’ అని నాలిక చివర మాట అంటున్నారు అమ్మా, నాన్న.

నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాను. బాదం చెట్టుకింద ఒంటరిగా కూచోబెట్టి బామ్మ హితోపదేశం మొదలు పెట్టింది. – “పిల్ల పేరు గాయత్రి….”

“అయితే…”

“రోజు పదిసార్లు పిలిచినా చాలు పుణ్యం పురుషార్ధం… పది మందిలో పుట్టి పెరిగినపిల్ల…”

“అయితే…”

“ఒరే కోర్నాసీ దూటకూరకీ, ముగ్గులకి బోలెడు ఓర్పూ, ఓపికా కావాలా పనితనమూ ఉండాలి… పిల్లకి రుక్మిణీ కళ్యాణం కంఠతా వచ్చుట- టీకా తాత్పర్యంతో సహా“.

“అయితే…”

“అయితేనా? ఇష్టమైన వాడి కోసం ఏదైనా చేసే జాణతనం వుందని…నువ్విట్టాగే మీనమేషాలు లెక్కేస్తూ కూచుంటే చివరికి ఆ పిల్లే నిన్ను లేవదీసుకు పోతుంది…. సరేనా..” అంది నాకు రోషం తెప్పించాలని –

అయినా నేనేమీ చలించలేదు. మర్నాడు ప్రయాణం రోజు వెళ్ళబోతూ నాన్న ముందు మౌనంగా నిలబడి మాట్లాడ్డానికి తటపటాయిస్తుంటే ఆయనే అందుకుని “నీ ఇష్టంరా… నేనేం నిధి నిక్షేపాలిచ్చానని నీ మీద పెత్తనం చెలాయిస్తాను. నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి… నీకు యిష్టమైతే మాదేముంది… వచ్చి పీటల మీద కూచుంటాం…” అన్నారు.

విషయం తేలిపోయింది.

రకరకాల ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టలేదు. బామ్మ ఒక రాత్రి వేళ చీకట్లో తడుముకుంటూ నాగదిలోకి వచ్చింది. నా మంచం మీద కూచుంది. మెల్లగా లేపాలని తడుముతోంది – “లేచే వున్నాలే చెప్పు…” అన్నాను.

“నువ్వు నిద్రపోవని తెలిసే వచ్చా, చూడబ్బాయ్ మీ నాన్న కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ… మీ అమ్మకి మొగుడు చెప్పింది వేదం – ఈ కోపతాపాలు 

నాలోజులుంటాయ్, ఆనక పోతాయ్…. మిగిలేది నిక్షేపంలాంటి పిల్ల… అంచేత నిష్కర్షగా గాయత్రినే చేసుకుంటానని తేల్చి మరీ వెళ్ళు….”

నేను ఏమీ చెప్పకుండా అటు తిరిగి పడుకున్నాను.

“ఒరేవ్ అధిక మాసాలతో ఎనభై దాటేశా… నీ పెళ్ళి చూడాలని ప్రాణం ఉగ్గపట్టుక్కూచున్నా… ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి. – నువ్వు ఆకు వక్క వేసుకుంటే అమ్మడు నోరు పండాలి – అదీ ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి. నేను మళ్లీ నీ ఇంటికి రావద్దూ…” బామ్మ గొంతు జీరపోయింది. కన్నీటి చుక్క నాగుండె మీద వెచ్చగా రాలింది.

ఉద్యోగం ఊరు చేరగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్న కి మూడు ముక్కల ఉత్తరం రాశా- పోస్టు చేయకుండానే “ముహూర్తం నిశ్చయమైంది… వున్న పళంగా పదిహేను రూజుల సెలవుపెట్టి రమ్మని” టెలిగ్రాం వచ్చింది.

ఇంట్లో అడుగు పెడుతుండగానే బామ్మ ఎదురొచ్చి “దిగివచ్చార్రోయ్… నీలాంటి అల్లుణ్ణి వదులుకుంటారా…. ఏదో కాస్త బెట్టు చేశారు..పాపం వాళ్ళదీ పెద్ద కుటుంబం – నాలుక్కాసులు ఒక్క ముద్దుకి చెల్లురా అంటే నువ్వూ విన్నావు కాదు… చివరకి మన నరసింహం సానుకూలం చేశాడు…” అని తెగ సంబరపడిపోతూ చెప్పింది.

నాన్న, అమ్మ దిగిరాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయగర్వంతో వున్నారు. ఎవరినీ నొప్పించకుడా కోరిన పిల్ల దొరికినందుకు “థాంక్ గాడ్” అనుకున్నాను. అది మా దొరివారి ఊతపదం.

కలతలూ కలహాలూ లేకుండా పెళ్ళి అయిపోయింది. ఒళ్లంతా కళ్ళు చేసుకుని బామ్మ మా పెళ్లి చూసి ఆనందించింది. “ఒరేయ్ ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వాములారి పల్లకి ఎక్కించమని హటం చేశావ్ జ్ఞాపకం వుందీ? ఇహ ఊరేగు బతుకంతా సుఖంగా అందరి కళ్ళూ మీ మీదే వుండేట్టు ఊరేగండి” అని బామ్మ మా జంటని దీవించింది.

అక్కర తీరింది.

మర్నాడు “నామనవడు నచ్చాడా పిల్లా” అని బామ్మ కొంటెగా అడిగితే – ఔను కాదు అనకుండా, “మీ మనవడు నాకిప్పుడు మూడొందల అరవై కాసులు బాకీ -ఎట్లా తీరుస్తాడో ఏమో…” అందట బుంగమూతి పెట్టి – పెళ్ళికూతురు.

ఆ మాటకి అదిరిపడి “హారి పిడుగా” అని బామ్మ గాయత్రిని ముద్దుపెట్టుకుంది.

***

బందరులో కాపరం పెట్టాం – బామ్మ మాటలో చెప్పాలంటే ముగ్గులోకి దిగాం. ఒంటి గది – కొత్త కాపరం – బామ్మ దీవెనలా పూసల పల్లకిలో ఊరేగుతున్నట్టుంది.

ఆవిడ కాళ్ల గోరింటాకు అతడి కాళ్ళకి ఎట్లా పండుతుందో అనుభవమైంది,

నేను తాంబూలం నమిలే గాయత్రి నోరు ఎందుకెరుపెక్కునో ఎరుకైంది. బామ్మని బందరు వచ్చి నా దగ్గర వుండమన్నాను.

“నా వూరు నా నేల… ఇక్కడే మట్టయిపోవాలిరా… మీ అమ్మ దొడ్డ ఇల్లాలు… నాకేం తక్కువ జరగదులే-” అది దర్జాగా.

బామ్మ చివరి క్షణాల్లో చూడ్డానికి వెళ్లాం. మాట స్పష్టత లేదు. “కొత్త కాపరం బావుందా” అని అడిగింది. ఇద్దరం తల వూపాం.

“కాపరం, కత్తిపీట కొత్తల్లో కంటే కొంచెం పదును పడ్డాకే బావుంటాయిరా…” అంది మాట పెగుల్చుకుని – మేం నవ్వితే బామ్మ పెదవి కదిలింది. ముఖం వెలిగింది . మా ఇద్దరి చేతులూ చేతిలోకి తీసుకుంది- “ఒక మొక్కకి చెంబెడు నీళ్ళు… గింజలు.. అన్నం పెట్టా… ఆ ఫలం నాకు దక్కింది. నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది… నేను ఇపుడో… కాసేపో…” – బామ్మ మాటలకి నాకు దుఃఖం పొర్లుకొచ్చింది.

“నిన్ను వదలి ఎక్కడికి పోతావ్రా వెర్రి నాగన్నా… అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా…” అంటూ ధైర్యం చెప్పి బామ్మ వెళ్ళిపోయింది.

భరించలేనంత శూన్యం నాలో నిండుకుంది. అమ్మ నాన్న చుట్టం పక్కం దయ దేవుడూ అన్నీ, అంతా, అందరూ ఒక్కసారి వదలి వెళ్ళిపోయి నట్టయింది.

వెళ్ళి పిచ్చిగా బాదంచెట్టు చుట్టూ తిరిగాను. డెబ్బై ఏళ్ళ ఆ పిచ్చి మొద్దుకి బామ్మ పోయిందని తెలియదు. రేపట్నించి చెంబెడు నీళ్ళెవరు పోస్తారు? పై తొర్రలో కిలకిలలాడే చిలకలకి తెలియదు బామ్మ పోయిందని – రేపట్నించి గుప్పెడు గింజలు ఎవరు జల్లుతారు? చిన్నప్పుడు మేము చిరుతిళ్ళు దాచుకున్న తొర్రలో చెయ్యి పెట్టి వెదికాను. దాన్నిండా బాదంకాయలు దాచి వున్నాయి. రేపట్నించి రాలిన బాదం కాయలు ఎవరు ఏరతారు?

బాదం చెట్టుని చుట్టుకున్న బామ్మ జ్ఞాపకాలు ఎన్నేళ్ళయినా మర్చి పోలేను. ఆ చెట్టు నీడలో నా చిన్న తనం చెక్కుచెదరకుండా వుంది.

కర్మ కాండ ముగిసింది. బామ్మ ఆరోప్రాణంగా చూసుకున్న బంగారు మురుగు తూకానికి పెడితే అది గిట్టు నగ అని తేలింది. అమ్మ, నాన్న, అత్తయ్య అంతా మొహమొహాలు చూసుకున్నారు.

మనవడికి మంచి పెళ్ళాం రావాలని బంగారు మురుగు కరిగించిందని వాళ్ళకి తెలియదు. పెళ్ళి పెద్దగా కథ నడిపిన నరసింహంపంతులుగారు చెప్పేదాకా నాకూ తెలియదు

బామ్మ మా ఇంటికి వస్తుంది అన్న మాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడకే… గాయత్రి సాక్షిగా *

(ఆంద్రజ్యో తి సచిత్ర వార పత్రిక -24-09-93)

పుస్తకం వివరాలు –

ప్రిజం పబ్లిషర్స్ ద్వారా ప్రచురితమైన ఈ పుస్తకం క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

లేదా ‘నవోదయ’ సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

నవోదయ బుక్ హౌస్

3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

ఫోన్ నెంబర్: 090004 13413

*Intro- outro BGM credits: Edhedho Ennam Valarthen | Durai Srinivasan | Soul Strings (https://www.youtube.com/watch?v=LWpJxRYZb2w)

“శ్రీరమణ గారు – బంగారు మురుగు” కి 8 స్పందనలు

  1. Beautiful narration.. Thank you sharing Harsha..

  2. చాలా మంచి కథ. చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ చదివిన అనుభూతి మిగిల్చింది ఒక్కసారిగా 60 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లి ఆ బాల్యం తాలూకు తీపి జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    1. అనిల్ కుమార్ Avatar
      అనిల్ కుమార్

      thank you Swarna garu.

  3. Excellent…. Sucha a beautiful story, ilanti kadhalu chadivi chaala rojulu ayyindi, ilaanti kadhalu raayaalani korukuntunnanu, thank u

    1. Heart touching narration. Only my generation can relate to these situations. Lucky we had a great and valuable child hood memories.

  4. Such a Beautiful Story, Hats off Sir Ramana

Leave a Reply to GKCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading